సచివాలయంలో ఫ్యామిలీ వివరాల్లో సక్కు లక్ష్మీసునీత ‘బీసీ–ఈ’గా, ఆమె కొడుకు ఆదిత్య ‘బీసీ–బీ’గా నమోదైనట్టు తెలిపే కాపీ
పిఠాపురం: డీఎస్సీ అక్రమాల చిట్టా చాంతాడులా పెరుగుతోంది. నష్టపోయిన ప్రతిభావంతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా కుమిలిపోయిన బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డీఎస్సీ ముసుగులో సర్కారు నిర్వాకాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏకంగా మతం, కులం మార్చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తేలడం నివ్వెరపరుస్తోంది. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మెగా డీఎస్సీ 2025లో కుల ధ్రువీకరణ పత్రం విషయంలో జరిగిన అవకతవకలపై విచారించి మెరిట్లో ఉన్న తనకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన షేక్ అమీరుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి...
ఇదీ జరిగింది..!
బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన షేక్ అమీరుద్దీన్ డీఎస్సీ–2025లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ మెరిట్ జాబితాలో 1,014వ ర్యాంకు సాధించాడు (హాల్టికెట్ నంబర్ ఎంఎస్సీ 0015369). అయితే బీసీ ‘బి’ కేటగిరీకి చెందిన సక్కు లక్ష్మీ సునీత.. బీసీ ‘ఈ’ (మైనారిటీ) కేటగిరీలో టీచర్ ఉద్యోగం పొందారు. కాట్రేనికోన మండలం కందికుప్ప జెడ్పీ హైస్కూల్లో ఆమెను నియమించారు. దీంతో బీసీ ‘ఈ’ కేటగిరీలో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని షేక్ అమీరుద్దీన్ కోల్పోయాడు. లక్ష్మీ సునీత ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాసంస్థల రికార్డుల్లో బీసీ ‘బి’(హిందూ అచ్చుకట్టువారు)గా నమోదైనట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 1998లో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంలోనూ ఆమెను బీసీ ‘బి’గా పేర్కొన్నారు. అయితే 2025 ఆగస్టు 18న పెద్దాపురం తహసీల్దారు నుంచి లక్ష్మీ సునీత బీసీ–ఈ ధ్రువీకరణ పత్రం పొందారు.


