
సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానుల సంఘం లేఖ
తమ బస్సుల ద్వారా ఆర్టీసీకి ఆదాయం వస్తున్నా రాయితీలు ఎందుకివ్వట్లేదని నిలదీత
వైఎస్సార్ బడుగు వికాసం కింద 300కు పైగా అద్దె బస్సులు కొనుగోలు చేసిన ఎస్సీ, ఎస్టీలు
ఎస్సీలకు రూ.600 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు బకాయి
సాక్షి, అమరావతి: “ఏడాదిగా మంత్రులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవని.. మాకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పుడు ఇవ్వలేమని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మా దగ్గర ఉన్న బస్సులు తగులబెట్టి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే గత్యంతర లేదు’ అని వాపోతున్నారు ఆర్టీసీకి అద్దె బస్సులు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు. ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.
ఏడాదిలో ఒక్క రూపాయైనా ఇవ్వలేదు
ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “వైఎస్సార్ బడుగు వికాసం’ పథకం కింద వీరంతా బస్సులు కొనుగోలు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అద్దె బస్సులుగా నడుపుతున్నారు. 300 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ యువత గత ప్రభుత్వ ప్రోత్సాహంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బస్సులు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీరికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు నిలిపివేసింది.
ఈ పథకం కింద లబ్ధి పొందిన ఎస్సీలకు సుమారు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.150 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా కూటమి సర్కారు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కేవలం వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద లబ్ధి పొందారన్న ఏకైక కారణంతో బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు లోకేశ్, టీజీ వెంకటేష్తోపాటు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, డైరెక్టర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్లను అనేకసార్లు కలిసి తమ కష్టాలు మొరపెట్టుకున్నా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వాపోయారు.
కనీసం రుణాల చెల్లింపునకు సంబంధించి బ్యాంకులతోనైనా మాట్లాడండి అని కోరుతున్నా ఉపయోగం లేకుండా పోతోందంటున్నారు. ఏడాది కావస్తున్నా బకాయిలతో పాటు ఈ ఏడాది ప్రోత్సాహకాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క అద్దె బస్సు నుంచి ప్రభుత్వానికి అన్ని ఖర్చులు పోనూ ప్రతినెలా రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తోందని బస్సు యజమానులు చెబుతున్నారు.
ప్రతినెలా 300 అద్దె బస్సుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్లకుపైగా ఆదాయాన్ని బడుగు పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నా ప్రభుత్వం తమపై కనికరం చూపించడం లేదని వాపోతున్నారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ డే లోగా పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయాలని.. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేసి సీఎం ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమంటూ ఎస్సీ, ఎస్టీ అద్దె బస్సుల యజమానులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
డబ్బులు లేనప్పుడు హామీ ఎందుకిచ్చారు?
చదువుకున్నా ఉద్యోగాలు లేని సమయంలో గత ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంటర్ప్రెన్యూర్గా తయారవుదామన్న ఆశతో వైఎస్సార్ బడుగు వికాసం పథకం కింద బస్సు కొనుగోలు చేసి నెల్లూరు–పామూరు మధ్య తిప్పుతున్నాను. ఈ పథకం కింద ఇస్తామన్న రాయితీలు ఇవ్వకపోవడంతో నాలాగే అనేకమంది ఎస్సీ, ఎస్టీ యువకులు బ్యాంకు ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. రాయితీలు ఇప్పుడు ఇవ్వలేం అంటున్నారు. డబ్బులు లేనప్పుడు ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇందుకు ఇచ్చారు. – హరి, నెల్లూరు–పామూరు అద్దె బస్సు ఓనర్
మా గోడు వినేవారేరి?
బడుగులు గోడు వినిపించుకునే అధికారులే కనిపించడం లేదు. ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ వంటి పెద్ద కంపెనీలకు రాయితీలు ఇవ్వడానికి వస్తున్న డబ్బులు మా ఎస్సీ, ఎస్టీలకు చెందిన చిన్న కంపెనీలకు వచ్చేసరికి ఎందుకు ఉండటం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశాం. మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసి విజ్ఞప్తి చేశాం. అధికారులనైతే లెక్కలేనన్నిసార్లు కలిశాం. అయినా ఉపయోగం లేదు. బ్యాంకు వాళ్లు పెడుతున్న ఇబ్బందులతో మేం బస్సులు నడపలేకపోతున్నాం. తక్షణం ప్రోత్సాహకాలు ఇప్పించండి. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం. – రాపాక మహేష్, అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్