మండిపోతున్న నిత్యావసరాల ధరలు
అత్యధిక ద్రవ్యోల్బణంలో దేశంలోనే ఏపీ మూడోస్థానం
ఏపీలో మే నెలలో 4.90 శాతం ద్రవ్యోల్బణం
పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు ఎక్కువ
గ్రామీణ ప్రాంతాల్లో 5.09 శాతం ద్రవ్యోల్బణం
పట్టణ ప్రాంతాల్లో 4.61 శాతం ధరల పెరుగుదల
కేంద్ర గణాంకాల, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే మేలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణంలో పాటు ఆహార ధరలు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక స్పష్టం చేసింది. మే నెలలో దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం గల రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెరుగుదల కారణంగా నిత్యావసర ధరలు, ప్రధానంగా ఆహార ధరలు పెరిగినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రాష్ట్రంలో మే నెలలో సాధారణ ద్రవ్యోల్బణం 4.90 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉంది. ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో సాధారణ ద్రవ్యోల్బణం 4.20 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 5.64 శాతం ఉంది. అంటే ఏప్రిల్ కన్నా మే నెలలో రాష్ట్రంలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టమైంది. మే నెలలో రాష్ట్రంలో పట్టణాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనేద్రవ్యోల్బణం అత్యధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 5.09 శాతం ద్రవ్యోల్బణం ఉండగా పట్టణాల్లో 4.61 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
జాతీయ సగటు కన్నా రాష్ట్రంలోనే అత్యధికంగా ద్రవ్యోల్బణం ఉంది. జాతీయ స్థాయిలో సాధారణ ద్రవ్యోల్బణం 3.93 శాతం ఉండగా ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతమే ఉంది. గత నెలతో పోల్చితే మేలో వంట నూనెలతో పాటు పప్పులు, కూరగాయలు ధరలు పెరిగాయి. ద్రవ్యోల్బణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.


