దేశవ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న హత్యలు
కాబోయే వాడు, కట్టుకున్నవాడు అని చూడకుండా చంపేస్తున్న మహిళలు
వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కుటుంబ కలహాలే కారణాలు
విడాకులిస్తే, కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేదానికి ప్రాణాలు తీస్తున్న క్షణికావేశం
కటకటాల పాలవుతామని తెలిసినా బరితెగిస్తున్న కొందరు భార్యలు
44 శాతం మంది సోషల్ మీడియా, డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన వారితో అక్రమ సంబంధాలు
ప్రేమలో ఉన్నప్పటికీ భాగస్వామిని మోసం చేస్తోన్న 37 శాతం మంది
53 శాతం మంది మహిళలకు తమ జీవిత భాగస్వామిపై అవిశ్వాసం, అనుమానం
అధ్యయనాల్లోనూ వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
సాక్షి, అమరావతి: నిండునూరేళ్లు కలిసి జీవించాల్సిన దాంపత్య బంధాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. అనుమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, ఆస్తి వివాదాలు సైతం చివరికి దారుణ హత్యలకు దారితీస్తున్నాయి. దీంతో కుటుంబ వ్యవస్థ విచి్ఛన్నం అవుతోంది. ఇటీవల దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భార్యలు భర్తలను హత్య చేస్తున్న ఘటనలు యావత్ సమాజాన్ని విస్తుగొలుపుతున్నాయి.
ముఖ్యంగా భర్తలను చంపడంలో మహిళలు అనేక సరికొత్త మార్గాలను ఎంచుకోవడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. ప్రెషర్ కుక్కర్, నీళ్ల డ్రమ్, బాత్రూమ్ టైల్స్ కింద, గ్యాస్ సిలిండర్లో ఇలా అనేక చోట్ల భర్త మృతదేహాలను దాచిపెట్టడం భీతిగొలుపుతోంది. కొండపై నుంచి తోసేయడం, తినే ఆహారంలో విషం కలపడం, విషం నింపిన ఇంజక్షన్లు చేయడం, కత్తితో పొడవడం, గొంతు నులిమి చంపేయడం, కిరాయి వ్యక్తులతో హత్య చేయించడం వంటి మార్గాలను ఎంచుకుని మరీ కట్టుకున్న వాడిని కడతేర్చుతున్నారు.
ప్రాణం తీస్తున్న పరిచయాలు..
సామాజిక మాధ్యమాల్లో ఏర్పడుతున్న పరిచయాలు తీవ్ర నేరాలకు పురిగొల్పుతున్నాయి. కొంత కాలం పరిచయాలే బంధాలుగా ఏర్పడి, అప్పటికే ఉన్న బంధాలను తెంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం, అనకాపల్లి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో భర్త హత్య కేసులు ఇటీవల సంచలనం సృష్టించాయి.
చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, అనుమానాలు, కుటుంబ కలహాలే ప్రధాన కారణాలుగా తేలాయి. హత్యలకు కుటుంబ, వ్యక్తిగత వివాదాలే కారణమని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ వైద్యులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం, హత్యలకు గురైన కేసుల్లో 36.36 శాతం కుటుంబ, ఆస్తి వివాదాలు, 29.55 శాతం వివాహేతర సంబంధాల వల్ల జరిగినట్లు తేలింది. బాధితులు, నిందితులు ఎక్కువగా ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనని అధ్యయనం వెల్లడించింది.
విస్మయం కలిగిస్తున్న అధ్యయనాలు..
వివాహేతర సంబంధాలపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయి. దేశంలోని టైర్–1, టైర్–2 నగరాలకు చెందిన 1,503 మంది వివాహితులపై నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 37 శాతం మంది ప్రేమలో ఉన్నప్పటికీ భాగస్వామిని మోసం చేయడం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ జీవిత భాగస్వామి కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
పది మందిలో ఆరుగురికిపైగా వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపినట్లు సర్వే పేర్కొంది. అలాగే పురుషుల్లో 59 శాతం, మహిళల్లో 53 శాతం మంది తమ భాగస్వామిపై అవిశ్వాసం లేదా అనుమానం వ్యక్తం చేశారు. 44 శాతం మంది సోషల్ మీడియా లేదా డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన వారితో సంబంధాలు ఏర్పరచుకున్నట్లు వెల్లడైంది. పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ఈ ధోరణి దాదాపు ఒకే స్థాయిలో ఉండటం గమనార్హం.
కుటుంబాలు ఛిన్నాభిన్నం..
మానసిక ఆరోగ్య వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడం, సోషల్ మీడియా ప్రభావం, మద్యం వ్యసనం, ఆర్థిక ఒత్తిళ్లు, పరస్పర అనుమానాలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. విభేదాలు వచ్చినప్పుడు కౌన్సెలింగ్, కుటుంబ పెద్దల మధ్యవర్తిత్వం లేదా చట్టబద్ధమైన విడాకుల వంటి మార్గాలను ఎంచుకోవాల్సిన చోట హత్యలకు పాల్పడటం అత్యంత ప్రమాదకర ధోరణిగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. భర్త హత్యకు గురైతే ప్రాణం కోల్పోయేది ఒక్కరే కాదు. తల్లిదండ్రులు కుమారుడిని, పిల్లలు తండ్రిని కోల్పోతారు. నేరానికి పాల్పడిన భార్య జైలుకు వెళ్లడంతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమవుతుంది. నమ్మకం, పరస్పర గౌరవం, సంభాషణ, సమస్యలకు శాంతియుత పరిష్కారాలే ఇలాంటి విషాదాలను నివారించే మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు.


