కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం | Rising flood flow in Krishna | Sakshi
Sakshi News home page

కృష్ణాలో పెరుగుతున్న వరద ప్రవాహం

Oct 21 2024 4:10 AM | Updated on Oct 21 2024 4:10 AM

Rising flood flow in Krishna

శ్రీశైలానికి 1,95,929 క్యూసెక్కుల రాక 

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురి సౌత్‌/తాడేపల్లి రూరల్‌: కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహం గంటగంటకూ పోటెత్తుతోంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేశుల, హంద్రీ నుంచి 1,95,929 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్‌ వద్ద ఆరు రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌వే ద్వారా నాగార్జున సాగర్‌కు 1,67,898 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 

ఆదివారం వరకు ఎగువ ప్రాజెక్ట్‌ల నుంచి 1,75,782 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా.. 1,59,070 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద 20 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయానికి 2,32,110  క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. ఇక్కడి నుంచి 2,45,943 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు చేరుతోంది. జేఈ రాజేష్‌ మాట్లాడుతూ.. పులిచింతల ప్రాజెక్ట్, ఇతర వాగుల నుంచి 1,62,689 క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి రానుందన్నారు. ఈ దృష్ట్యా బ్యారేజీ వద్ద 20 గేట్లు 4 అడుగులు, 50 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి దిగువకు 1,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement