కోటిన్నరతో.. కృష్ణా రామా!
భారత్లో అతి తక్కువ ఖర్చుతో రిటైర్మెంట్ జీవితం
అమెరికా ఉద్యోగులపై ‘ఏగాన్’ సంస్థ సర్వేలో వెల్లడి
అమెరికన్లు శేష జీవితాన్ని గడిపేందుకు వివిధ దేశాల్లో వ్యయంపై అధ్యయనం
సింగపూర్లో రిటైర్మెంట్ జీవితం అత్యంత ఖరీదు.. రూ.9.21 కోట్లు కావాల్సిందే
సాక్షి, అమరావతి: రూ.కోటిన్నర ఉంటే చాలు.. మన దేశంలో రిటైర్మెంట్ అనంతరం కృష్ణా రామా అని ప్రశాంతంగా జీవనం గడిపేయొచ్చట. అయితే.. ఈ లెక్క భారతీయులకు సంబంధించి కాదండోయ్. అమెరికన్ల కోసం మాత్రమే! ఎందుకంటే.. అమెరికా ఉద్యోగులు, రిటైరైన వారిలో 13 శాతం మంది పదవీ విరమణ అనంతర జీవితాన్ని విదేశాల్లో గడిపే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘ఏగాన్’ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అమెరికన్లు రిటైర్మెంట్ అనంతరం వివిధ దేశాల్లో సాఫీగా జీవితం గడిపేందుకు ఎంత ఖర్చవుతుందనే గణాంకాలను ఆ సంస్థ విడుదల చేసింది.
► రిటైర్మెంట్ అనంతరం జీవించేందుకు ప్రపంచంలో అత్యధికంగా సింగపూర్లో ఎక్కువ వ్యయం (దాదాపు రూ.9.21 కోట్లు) కానుంది. అమెరికాతో పోలిస్తే సింగపూర్లోనే 60% అధికంగా రిటైర్డు జీవితానికి ఖర్చవుతుంది. ఆ తరువాత స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్లో కూడా అమెరికాతో పోలిస్తే శేష జీవిత ఖర్చులు ఎక్కువే.
► రిటైరైన అమెరికా ఉద్యోగులు తరువాత జీవితాన్ని సాఫీగా గడపాలంటే పాకిస్థాన్లో రూ.1.30 కోట్లు, భారత్లో రూ.1.53 కోట్లకుపైగా వ్యయం అవుతుంది.
► ఓ అమెరికా ఉద్యోగి రిటైరైన తరువాత స్వదేశంలో (అమెరికా) శేష జీవితం గడపాలంటే దాదాపు రూ.5.79 కోట్లు కావాలి.