
పరిటాల పచ్చ దండు దౌర్జన్యం
లైంగికదాడి బాధితురాలి కుటుంబ పరామర్శకు వెళ్తుంటే ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రామగిరి మండలం రౌడీరాజ్యానికి అడ్డాగా మారింది. పరిటాల పైశాచికత్వం రాజ్యమేలుతోంది. గతంలో పరిటాల రవి అనుచరులతో ఎలా అయితే ఇక్కడ ఘాతుకాలు జరిగాయని చెప్పుకుంటారో.. ఇప్పుడూ అదే జరుగుతున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. గురువారం జరిగిన ఘటన దీనికి అద్దం పడుతోంది. వారం రోజుల క్రితం రామగిరి మండలం పేరూరు పంచాయతీ ఏడుగుర్రాలపల్లికి చెందిన ఓ దళిత బాలిక సామూహిక లైంగిక దాడికి గురైన విషయం తెలిసిందే.
బాధిత బాలిక కుటుంబాన్ని వైఎస్సార్ సీపీ మాజీ మంత్రులు పరామర్శించాలనుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పరిటాల సునీత సైన్యం రంగంలోకి దిగింది. ‘ఆ ఊళ్లోకి వైఎస్సార్ సీపీ నాయకులు ఎలా వెళతారో మేమూ చూస్తాం’ అంటూ తన అనుచరులతోపాటు పోలీసులతో అడుగడుగునా అడ్డుకున్నారు. బాలిక ఊరిలోకి వెళ్లనివ్వలేదు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వెళుతున్న రెండు వాహనాలను టీడీపీ మూకలు ధ్వంసం చేశాయి. కార్ల అద్దాలు పగులగొట్టాయి.
ముందురోజే ప్లాన్ మారింది
లైంగికదాడి బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడానికి ఏడుగుర్రాలపల్లికి గురువారం వెళుతున్నట్టు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఉషశ్రీచరణ్, శైలజానాథ్లతోపాటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నాటికి కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా రామగిరి మండలంలో టీడీపీ నాయకులు బైక్ ర్యాలీ చేయాలని నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఏడుగుర్రాలపల్లికి వస్తున్నారన్న ప్రకటనతో బైక్ ర్యాలీని గురువారం రాత్రికి రాత్రి రామగిరి నుంచి పేరూరుకు ఎమ్మెల్యే సునీత మార్చారు.
అంతేకాదు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి కార్యకర్తలను పేరూరుకు తీసుకురావాలని పరిటాల కుటుంబం ఆదేశించడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలంతా పేరూరుకు చేరుకున్నారు. ఈ ఊర్లోకి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకు ఈ ఎత్తుగడ వేశారు. దీంతోపాటు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆ ఊర్లోకి ఎవరూ రాకుండా అడ్డుకోవాలని పోలీసులనూ ఆదేశించినట్టు తెలిసింది.
అడుగడుగునా అడ్డుగోడలే
ముందుగా ప్రకటించిన మేరకు వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు గురువారం ఉదయమే అనంతపురం నుంచి బయలు దేరారు. ఉషశ్రీచరణ్ మాత్రం పెనుకొండ నుంచి బయలు దేరారు. కానీ ఏ రూటులో వెళ్లినా.. పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపైనే ఉషశ్రీచరణ్ను అడ్డుకున్నారు. ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శైలజానాథ్, మేరుగ నాగార్జున, తోపుదుర్తి ప్రకాష్రెడ్డిలనూ అడ్డుకున్నారు.
అడ్డంకులను దాటుకుని అతికష్టమ్మీద మద్దెలచెరువు గ్రామం వరకూ నాయకులు వెళ్లారు. అక్కడినుంచి పోలీసులు వారిని పేరూరుకు వెళ్లనివ్వలేదు. దీంతో వారు అక్కడే మీడియాతో మాట్లాడి వెనుదిరిగారు. అంతకుముందే వందలాదిమంది టీడీపీ మూకలు పేరూరులోనే వంటావార్పు చేపట్టి మకాం వేశాయి. ఎలాగైనా ప్రతిపక్ష నేతలు బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించకూడదనే ఈ ఎత్తుగడ వేశారు.
మహిళా ఎమ్మెల్యే అయి ఉండీ..
తన నియోజకవర్గం, తన సొంత మండలానికి చెందిన దళిత బాలికపై నెలల తరబడి 14 మంది లైంగిక దాడికి ఒడిగడితే ఎమ్మెల్యే పరిటాల సునీత కనీసం బాధిత బాలికను పరామర్శించిన పాపాన పోలేదు. పైగా ఆ ఊళ్లోకి ఎవరూ రాకుండా గూండాలను పెట్టి అడ్డుకుంటున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత బాలిక ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ బతుకునీడిస్తోంది. ప్రత్యేక వైద్యం లేదు, ఇప్పటివరకూ సర్కారు నుంచి సాయమూ లేదు.
ఇవన్నీ దగ్గరుండి చూడాల్సిన స్థానిక మహిళా ఎమ్మెల్యే..పేరూరులో బలగాలను మోహరించి, ఆ ఊర్లోకి ఎవరినీ రాకుండా చూడటం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగిరిలో రౌడీరాజ్యం కాదు ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదే నియోజకవర్గంలో మూడు నెలల వ్యవధిలో మూడు హత్యలు జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా ఈ ఊర్లోకి ఎవరూ రాకూడదని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ప్రెస్నోట్ రిలీజ్ చేయడం మరో విశేషం.