629 ఏఈఈ పోస్టులకు విద్యుత్ సంస్థల నోటిఫికేషన్లు
నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
జూలై 20 అర్ధరాత్రి వరకు గడువు
ఆగస్టు 22 నుంచి 29 వరకు పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. మొత్తం 629 ఏఈఈ పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ట్రాన్స్కోకు 200 పోస్టులు, జెన్కోకు 100, ఈపీడీసీఎల్కు 134, సీపీడీసీఎల్కు 60, ఎస్పీడీసీఎల్కు 135 పోస్టులు కేటాయించారు. ట్రాన్స్కోలో 167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం ఏఈఈ పోస్టులు ఉండగా, మిగతా పోస్టులు కూడా ఇదే తరహాలో భర్తీ చేయనున్నారు.
దరఖాస్తులు ఈ నెల 30 నుంచి ఆన్లైన్ అందుబాటులో ఉంటాయి. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల నుంచి రూ.1,000 రుసుం చెల్లించి దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 20వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు సమర్పించడానికి గడువు ఇచ్చారు. కాగా ఆగస్టు 22 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా 47, తెలంగాణలో రెండు సెంటర్లలో, బెంగళూరు, చెన్నై, బెరంపూర్లలో ఒక్కో సెంటర్ చొప్పున మొత్తం 52 సెంటర్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
విద్యుత్ సంస్థల వారీగా పోస్టులు
ఏపీ ట్రాన్స్కో: 200
(167 ఎలక్ట్రికల్, 23 సివిల్, 10 టెలికాం)
ఏపీ జెన్కో: 100 (80 ఎలక్ట్రికల్, 20 సివిల్)
ఏపీఎస్పీడీసీఎల్: 134
(125 ఎలక్ట్రికల్, 6 సివిల్, 3 టెలికాం)
ఏపీసీపీడీసీఎల్: 60
(56 ఎలక్ట్రికల్, 3 సివిల్, 1 టెలికాం)
ఏపీఈపీడీసీఎల్: 135
(128 ఎలక్ట్రికల్, 4 సివిల్, 3 టెలికాం)
ఇవీ నిబంధనలు..
» నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగంలో చేరిన ప్రతి అభ్యర్థి రూ.110 నాన్ జ్యుడీషియల్ స్టాంప్పై సర్వీస్ బాండ్ సమర్పించాలి. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తయిన తర్వాత మరో 5 ఏళ్లు తప్పనిసరిగా పనిచేయాలి. అంటే మొత్తం 7 సంవత్సరాల బాండ్ కాలం అమల్లో ఉంటుంది.
» ప్రొబేషన్ పూర్తికాకముందే ఉద్యోగం వదిలేస్తే అప్పటివరకు పొందిన వేతనం మొత్తం తిరిగి చెల్లించడంతోపాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తారు.
» ప్రొబేషన్ అనంతరం ఐదేళ్ల సర్వీస్ పూర్తికాకముందే రాజీనామా చేస్తే రూ.10 లక్షల లిక్విడేటెడ్ డ్యామేజెస్ చెల్లించాల్సి ఉంటుంది.
» అభ్యర్థుల డిగ్రీ, జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ వంటి ఒరిజినల్ సర్టిఫికెట్లను బాండ్ కాలం మొత్తం సంస్థ వద్దే జమ చేయాలి. అత్యవసరంగా సర్టిఫికెట్లు కావాలంటే ముందుగా రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాతే తాత్కాలికంగా తీసుకునే అవకాశం ఉంటుంది.
» నోటిఫై చేసిన పోస్టులకు 1:1 నిష్పత్తిలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. వెయిటింగ్ లిస్ట్ ఉండదు. ఎంపికైన అభ్యర్థి చేరకపోయినా ఆ పోస్టును మరొకరితో భర్తీ చేయరు.
» 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 మధ్య తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చి స్థిరపడిన వారు స్థానికత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.


