సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహనసేవల వివరాలు :
• తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
• ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
• ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
• మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
• మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
• సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
• సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
• రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు రద్దు :
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరీ
‘అనగనగా ఓ రాజు’ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరీ శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన నవీన్ పోలిశెట్టి, ‘అనగనగా ఓ రాజు’ చిత్రం బ్లాక్బస్టర్ కావడంతో శ్రీవారి ఆశీస్సులు కోరేందుకు తిరుమల వచ్చాం. ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సంక్రాంతి పండుగకు అద్భుతమైన విజయాన్ని అందించింది అని తెలిపారు.
అలాగే, త్వరలో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా మరో కొత్త సినిమాతో ముందుకు వస్తాను అని నవీన్ పోలిశెట్టి హామీ ఇచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరీ కూడా ఈ విజయానికి ప్రేక్షకులే కారణమని కృతజ్ఞతలు తెలిపారు.


