కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్రతిష్ట
ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంపై
మండిపడుతున్న ప్రయాణికులు
మంత్రి తీరును దుయ్యబడుతున్న పరిస్థితి
మంత్రిగా సమస్యను డీల్ చేయలేకపోయారని విమర్శలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్రతిష్ట పాలయ్యారు. రామ్మోహన్ నాయుడు తన వాగ్ధాటితో ఇన్నేళ్లు నెట్టుకువచ్చారు. వీటిపైనే సామాజి క మాధ్యమాల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలివేషన్ వీడియోలు చేసి బిల్డప్లు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలు మాత్రం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడిని అభాసుపాలు చేశాయి. ఆయనకు ఎంత ఎలివేషన్ ఇస్తున్నారో అంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తోంది.
రామ్మోహన్నాయుడు హయాంలో భారత విమానయాన శాఖ గౌరవానికి మచ్చ వచ్చి పడింది. జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికుల శాపనార్థాలతో విమానాశ్రయాలు గగ్గోలు పె డుతున్నాయి. గత ఐదు రోజులుగా విమాన సర్వీ సులు రద్దువుతున్నా ఏం చేయలేకపోయారని ప్రయాణికులు కేంద్ర మంత్రిపై మండిపడుతున్నారు. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు, షెడ్యూల్ ప్రకారంగా వెళ్లాల్సిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు.
ఇండిగో విమానాలు అకస్మాత్తుగా నిలిచిపోవడం, 1000కి పైగా విమానాల సేవలు రద్దు కావడంతో, వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులంతా లబోదిబోమంటున్నారు. కేంద్ర మంత్రిపైన, చివరికి కేంద్రప్రభుత్వంపైన ప్రయాణికులంతా ధ్వజమెత్తుతున్నారు. దేశంలో ఇండిగో విమానాల రాకపోకలు నిలిచిపోవడం అతి పెద్ద ప్రయాణ సంక్షోభంగా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రిగా పరిష్కరించలేకపోయారని, సంక్షోభాన్ని డీల్ చేయలేకపోయారని విమర్శలకు గురవుతున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం మాటలు చెప్పినంత సులువు కాదని విమాన ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
అంతకుముందు కూడా
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంతకుముందు కూడా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఈ ఏడాది జూన్లో అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్లాల్సిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో కూలిపోయిన సమయంలో ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు వీడియో తీశారు. దానికి బ్యాగ్రౌండ్ మ్యూ జిక్ జత చేసి పోస్టు చేయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. విషాద సమయంలో ఇలాంటి పనులేంటని నెటిజన్లు ధ్వజమెత్తారు. మంత్రి తీరుపై దేశమంతా చర్చ జరిగింది.


