తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ | Ram Gopal Varma On Vyuham Movie Controversy | Sakshi
Sakshi News home page

తప్పుడు చానళ్లపై కేసులు వేస్తా: ఆర్జీవీ

Dec 8 2024 5:08 AM | Updated on Dec 8 2024 5:08 AM

Ram Gopal Varma On Vyuham Movie Controversy

సాక్షి, హైదరాబాద్‌: తనపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, మహాటీవీ సహా మరికొన్ని చానళ్లపై పరువు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ తనపై, తన భాగస్వామి రవివర్మపై దుష్ఫ్రచారాన్ని సహించేది లేదని అన్నారు. 

వ్యూహం సినిమాకు దాసరి కిరణ్‌కుమార్‌ నిర్మాత కాగా, శ్రీకాంత్‌ ఫైనాన్స్‌ సహకారం అందించారని, భాగస్వామి రవివర్మ సొంతంగా శ్రీకాంత్‌ నుంచి ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రసార హక్కులను కొనుగోలు చేశారని, రవి వర్మ నుంచి ఏపీ ఫైబర్‌నెట్‌ రూ.2 కోట్లకు కొనుగోలు చేసి, కోటి రూపాయలు మాత్రమే ఇచ్చిందని ఆర్జీవీ తెలిపారు. 60 రోజులపాటు ఏపీ ఫైబర్‌నెట్‌కు హక్కులు ఇస్తే, లక్షన్నర వరకు వ్యూస్‌ వచ్చాయని చెప్పారు. 

టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రసారాలు నిలిపేశారని, కానీ తనకు రావాల్సిన మిగిలిన మొత్తం కోసం రవివర్మ సివిల్‌ కోర్టులో దావా వేశారని ఆర్జీవీ చెప్పారు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ తనతో పాటు రవి వర్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లను చట్టప్రకారం ఎదుర్కొంటానని ఆర్జీవీ తన ప్రకటనలో హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement