
టెక్కలి: రోడ్డు విస్తరణ పేరుతో అర్ధరాత్రి వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే ఎక్కడికి పోతాం అంటూ.. అంబ్కేడర్ జంక్షన్ సమీపంలో ని వాసం ఉంటున్న వారంతా సోమవారం రాత్రి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులను నిలదీశారు. అంబేడ్కర్ జంక్షన్ నుంచి చెట్లతాండ్ర మార్గంలో రోడ్డు విస్తరణకు చర్యలు చేపట్టిన క్రమంలో ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన పనులు చేపట్టారు.
అయితే సోమవారం రాత్రి పంచాయతీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి ఉదయాన్నే ఇళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో, అక్కడ నివసిస్తున్న వారంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఇన్చార్జి తహసీల్దార్ రవికుమార్ వద్ద సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే ముందుగా దుకాణాలు తొలగిస్తామని, ఆ తర్వాత ఇళ్లు ఖాళీ చేయిస్తామని ఆయన సర్దిచెప్పారు.
ఇల్లు కోల్పోయిన వారందరికీ ఇల్లు ఇస్తామని మంత్రి చెప్పారని ఇప్పుడు ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చెయ్యమంటే, పిల్లలతో ఎక్కడకు వెళ్లాలని వారంతా నిలదీశారు. గతంలో ఇంటి స్థలం మంజూరు కాకపోయిన వారందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో అంతా వెనుదిరిగారు. ముందుగా ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత విస్తరణ పను లు చేయాలి తప్ప ఇలా అర్ధరాత్రిళ్లు వచ్చి తెల్లవారింటికి ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం సమంజసం కాదంటూ బాధితులు మండిపడ్డారు.