మహిళననీ చూడకుండా లాఠీలతో కొట్టారు | Police beat up woman over land issue | Sakshi
Sakshi News home page

మహిళననీ చూడకుండా లాఠీలతో కొట్టారు

Apr 18 2025 3:39 AM | Updated on Apr 18 2025 3:39 AM

Police beat up woman over land issue

భూమి విషయమై అబద్ధం చెప్పాలంటూ విరుచుకుపడ్డారు  

మీడియా ఎదుట వాపోయిన మహిళ 

తిరుపతి సిటీ: ఒక భూమి విషయంలో అబద్ధాలు చెప్పాలంటూ తనను తిరుచానూరు స్టేషన్‌కు ఈడ్చుకెళ్లిన పోలీసులు లాఠీలతో కుళ్లబొడిచారని స్థానిక సుందరయ్య నగర్‌కు చెందిన ఇ.హేమలత అనే మహిళ విలపించింది. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటి పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్న తనను మంగళం కృష్ణవేణి యాదవ్‌ కాలనీకి సంబంధించిన భూమి విషయమై మాట్లాడాలని తిరుచానూరు పోలీసులు బూతులు తిడుతూ స్టేషన్‌కు లాక్కెళ్లారని తెలిపింది. 

పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి, మహిళా కానిస్టేబుల్‌ సునీత, ఇతర సిబ్బంది తనవద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ.23 వేల నగదు, చేతి వేలి ఉంగరం లాక్కున్నారని ఆరోపించింది. ఆ తరువాత ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి సమక్షంలో కానిస్టేబుల్‌ సునీత జుట్టు పట్టుకుని ఈడ్చి  మెడపై బలంగా గుద్దుతూ బూతులు తిడుతూ కొట్టిందని ఆరోపించింది. 

తన ఎడమ చేతిని వెనక్కి తిప్పి లాఠీతో అతి దారుణంగా కొట్టారని, కుడి చేయి తిప్పి రబ్బరు టైరులాంటి వాటితో విపరీతంగా కొట్టి గాయపరిచారని విలపించింది. ఆ భూమిని కొనుక్కున్న వాళ్లు తనకు డబ్బులు ఇవ్వలేదని చెబితే తనను వదిలేస్తామని, లేదంటే తనపై బ్రోతల్‌ కేసు, తన కుమారుడిపై గంజాయి కేసు పెడతామని బెదిరించారని పేర్కొంది. ఈ వ్యవహరమంతా మంగళం వార్డు మెంబర్‌ నాగయ్య సమక్షంలో జరిగిందని తెలిపింది. 

అనంతరం ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు సాయిలక్ష్మి, జయంతి మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా అతికిరాతకంగా కొడుతూ కులం పేరుతో దూషించిన ఎస్‌ఐ సాయినాథ్‌ చౌదరి, మహిళా కానిస్టేబుల్‌ సునీతను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మహిళా సంఘాలు ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ విషయంపై ఎస్పీకి వినతిపత్రం అందజేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement