
గుంటూరు, సాక్షి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నవయుగ కవిచక్రవర్తి, మహాకవి గుర్రం జాషువా జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఆయన్ని స్మరించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.
తన కవితల ద్వారా గుర్రం జాషువా మూఢాచారాలను ప్రశ్నించారని, దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా కావ్యాలు రాశారని అన్నారు . తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు ఎల్లకాలం గుర్తుంటాయన్న వైఎస్ జగన్.. ఆ మహాకవి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు అని ఎక్స్లో ఓ సందేశం ఉంచారు.
అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవి పద్మభూషణ్ గుర్రం జాషువా గారు. దళితుల జీవన విధానాన్ని అద్దం పట్టేలా ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ``గబ్బిలం ``ఎంతో ప్రాచుర్యం పొందింది. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నేడు ఆ మహాకవి జయంతి సందర్భంగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2024

YSRCP కేంద్ర కార్యాలయంలో..
మహాకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. జాషువా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కొమ్మూరి కనకారావు, అడపా శేషు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తిగా, అప్పటి మూఢాచారాలను తన కవితల ద్వారా ప్రశ్నించిన మహాకవిగా తనదైన ముద్ర వేసుకున్న గుర్రం జాషువాను ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.

