మృత్యువుతో నిత్య పోరాటం | Perilous journey on country boats | Sakshi
Sakshi News home page

మృత్యువుతో నిత్య పోరాటం

Jun 20 2026 5:34 AM | Updated on Jun 20 2026 5:34 AM

Perilous journey on country boats

మత్స్యగెడ్డలో నాటు పడవలపై  ప్రమాదకరంగా ప్రయాణం!

కుమ్మరిపుట్టు వద్ద నోచుకోని వంతెన నిర్మాణం 

సర్వేలతో కాలయాపన చేస్తున్నఅధికార యంత్రాంగం 

ఇప్పటివరకు 91 మంది గిరిజనుల బలి 

ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం 

కనీసం ఫైబర్‌ బోట్లు, వలల పంపిణీకి నోచుకోని వైనం

ఒకవైపు గెడ్డ దాటలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు.. మరోవైపు ఏళ్ల తరబడి వంతెన కోసం ఎదురుచూపులు! ఇది అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని మత్స్యగెడ్డ పరివాహక గ్రామాల గిరిజనుల నిత్యకృత్యం. అభివృద్ధి కన్నా ప్రమాదాలే ఎక్కువగా పొంచి ఉన్న ఈ జలమార్గం, గిరిజనులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ఎన్నికల వేళ హామీల జల్లులు కురిపించే నేతలు, గెలిచిన తర్వాత ఈ గెడ్డ దాటే కష్టాలను పట్టించుకోకపోవడంతో వంతెన కల ఏళ్లుగా నీటిపై రాతగానే మిగిలిపోతోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ముంచంగిపుట్టు: మండలంలోని పలు గ్రామాల గిరిజనులకు మత్స్యగెడ్డను దాటడమంటేనే నిత్యం మృత్యువుతో పోరాటం. నిత్యావసర సరుకులు, వ్యాపార లావాదేవీలు, విద్య వంటి ప్రతి అవసరానికి గిరిజనులు గెడ్డపై నాటు పడవలనే ఆశ్రయించక తప్పడం లేదు. ఇలాంటి ప్రమాదకర ప్రయాణాల్లో పడవలు మునిగి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి. 

మండలంలోని పనసపుట్టు, సుజనకోట, పెదగూడ, దారెల, వనుగుమ్మ, జోలాపుట్టు, మాకవరం, రంగబయలు పంచాయతీల పరిధిలోని దాదాపు 86 గ్రామాల ప్రజలు ప్రతిరోజూ నాటు పడవలపైనే మండల, పంచాయతీ కేంద్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. గిరిజన మత్స్యకారులు సైతం ఇదే పడవలపై చేపల వేట సాగిస్తూ, వాటిని మండల కేంద్రంలోని వారపు సంతల్లో అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 

నీటిపై రాతలుగానే.. 
ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు హుటాహుటిన వచ్చి బాధిత కుటుంబాలకు భరోసా ఇస్తుంటారు. ఆ తర్వాత ఆ హామీలను విస్మరించడం పరిపాటిగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం, మండలంలోని ఆరు పంచాయతీల పరిధిలో నాటు పడవల ప్రమాదాల వల్ల ఇప్పటివరకు 91 మంది మృతి చెందారు. ముఖ్యంగా సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామం వద్ద గిరిజనులు తాడు సాయంతో బోటును ప్రమాదకరంగా లాగుతూ గెడ్డ దాటుతున్నారు. 

ఇక్కడ ఇప్పటివరకు నాటు పడవ ప్రమాదాలు, ఈతకు వెళ్లిన సమయంలో మునిగి 32 మంది వరకు జలసమాధి అయ్యారు. కుమ్మరిపుట్టు వద్ద వంతెన నిర్మించాలని గిరిజనులు ఏళ్లుగా పోరాడుతున్నా, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు హామీలిచ్చి, ఆ తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వేలతో కాలయాపన 
వంతెన నిర్మాణం కోసం సుజనకోట పంచాయతీ గిరిజనులు పాడేరు వెళ్లి, మండల కేంద్రానికి వచ్చిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు వినతి పత్రాలు అందజేశారు. అధికారులు పలుమార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపినప్పటికీ, నేటికీ నిధులు మంజూరు కాలేదు. అధికారులు సర్వేల పేరుతో కాలయాపన చేయడం మానేసి, వెంటనే నిధులు మంజూరు చేసి వంతెన నిర్మాణాన్ని ప్రారంభించాలని సుజనకోట పంచాయతీ గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే, గిరిజన మత్స్యకారులకు రాయితీపై బోట్లు, వలలు అందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి 
మత్స్యగెడ్డ ప్రాంతాల్లో గిరిజనులు తరచూ నాటు పడవ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన ప్రతిసారీ ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి హామీలు ఇస్తున్నారు, ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన మత్స్యకారులకు ఉచితంగా బోట్లు, వలలు అందించాలి. ముఖ్యంగా కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మించడం అత్యంత ఆవశ్యకం. 
– వెంగడ రమేష్, మాజీ సర్పంచ్, సుజనకోట పంచాయతీ

ప్రతిరోజూ ప్రాణ సంకటమే 
నిత్యం ఈ గెడ్డ దాటితేనే మాకు జీవనం గడుస్తుంది. మండల కేంద్రానికి, వారపు సంతలకు వెళ్లి మట్టి పాత్రలు అమ్ముకుని బతుకుతున్నాం. గెడ్డ దాటే క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, మంత్రులు వచ్చి వంతెన కట్టిస్తామని హామీలు ఇస్తున్నారు కానీ, అవి కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి మా రాకపోకల కష్టాలను తీర్చాలి. –  కృష్ణ, గ్రామస్తుడు, కుమ్మరిపుట్టు

నివేదికలు పంపాం 
కుమ్మరిపుట్టు వద్ద మత్స్యగెడ్డపై వంతెన నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జాయింట్‌ కలెక్టర్, ఐటీడీఏ పీవోల దృష్టికి గిరిజనులు ఈ సమస్యను  తీసుకెళ్లడంతో, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాం. వంతెన నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించి, నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరిగింది. గిరిజనులు నాటు పడవలపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.     – వేణుగోపాల్, ఈఈ, ట్రైబల్‌ వెల్ఫేర్, పాడేరు 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement