
సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తను టార్గెట్ చేసిన పరిటాల వర్గీయలు.. దాడులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు.. బీజేపీ కార్యకర్త అరవింద్ రెడ్డిపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
రాప్తాడులో పరిటాల వర్గీయులు హల్చల్ చేశారు. ధర్మవరం బీజేపీ కార్యకర్త అరవింద్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. చెన్నేకొత్తపల్లిలో అరవింద్ రెడ్డి దాబా వద్ద ఆగిన సమయంలో పరిటాల శ్రీరామ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం, ఎన్నికల సమయంలో ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని అరవింద్తో వాదనకు దిగారు. అరవింద్ రెడ్డి.. తమ కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలని పరిటాల అనుచరులు ఓవరాక్షన్కు దిగారు.
దీంతో, వారి మధ్య వాగాద్వం జరిగింది. ఆగ్రహంతో రెచ్చిపోయిన పరిటాల వర్గీయులు.. తమ వద్ద ఉన్న కర్రలు, మారణాయుధులతో అరవింద్ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అరవింద్ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, బాధితుడు అరవింద్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపించాడు. కావాలనే తనను టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. ఇక, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీకి అరవింద్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు.
