తాడేపల్లి: కూటమి నేతల దౌర్జన్య కాండపై ఓ ఎన్ఆర్ఐ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ 28 ఏళ్ల కష్టాన్ని దోచుకోవడానికి అధికార పార్టీ నేతలు చూస్తున్నారని ఎన్ఆర్ఐ మురళి కుటుంబం.. వైఎస్సార్సీపీని ఆశ్రయించింది. దీనిలో భాగంగా తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎన్ఆర్ఐ మురళీ భార్య కృష్ణకుమారి మీడియాతో మాట్లాడారు.
‘ 28 ఏళ్లుగా సంపాదించిన డబ్బుతో కాంప్లెక్స్ కట్టాం. సినిమా థియేటర్లు, మాల్స్ మేము నిర్మించాం. మా మాల్ ని ఆపేశారు. 90 లక్షలు మేము దాని కోసం అప్పులు చేశాం. మేము మోసం చేసామంటూ తప్పుడు ప్రచారం చేశారు. మా మాల్ చుట్టూ టెంట్లు వేసి, జనాన్ని పెట్టి బెదిరిస్తున్నారు. మేము పోలీసులు కి ఫిర్యాదు చేస్తే తిరిగి మాపై కేసు పెట్టారు. కోర్టు భద్రత కల్పించమని ఆదేశించినా పట్టించుకోవడం లేదు. మాకు పోలీసులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం ఎవ్వరు రక్షణ ఇవ్వడం లేదు. ఎన్ఆర్ఐలకి ప్రభుత్వం ఇచ్చే సందేశం ఇదేనా?, దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు.
ఆయన మద్దతు లేకపోతే ఇది జరుగుతుందా?, మా ప్రభుత్వం లో ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2024, ఆగస్టు 4వ తేదీన ఎమ్మెల్యేకి చెప్పాము. వాళ్లంతా కుమ్మక్కై ఇదంతా చేస్తున్నారు. ఆ మాల్ని లాక్కోవాలని చూస్తున్నారు. నా భర్త దీనికోసం పోరాడుతున్నందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన మీద డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారు. చిలకలూరిపేటలో అడుగు పెడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిలో భాగంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ‘ కూటమిలో నేతలు నీచ, నికృష్టంగా ఉన్నారు. విపరీతంగా దోపిడీ, అవినీతికి పాల్పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేస్తున్నారు. చిలకలూరిపేటలో ఎన్ఆర్ఐ ఆస్తులను అక్రమిస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు బుద్ధి లేకుండా కబ్జాలు చేస్తున్నారు. టెంట్లు వేసి మనుషులను పెట్టి కబ్జా చేశారు. కోట్ల అస్థిని కాజేయాలని పుల్లారావు చూస్తున్నారు. కోర్టు చెప్పినా కూడా ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.


