గ్రిడ్‌ కనెక్టివిటీ బదిలీకి కొత్త షరతులు | New conditions for grid connectivity transfer | Sakshi
Sakshi News home page

గ్రిడ్‌ కనెక్టివిటీ బదిలీకి కొత్త షరతులు

Jun 17 2026 6:05 AM | Updated on Jun 17 2026 6:05 AM

New conditions for grid connectivity transfer

కనెక్టివిటీ హక్కులు ఇక సులభం కాదు

క్లస్టర్‌ విధానంలో మంజూరైన కనెక్టివిటీ కూడా ఇతర ప్రాజెక్టులకు ఆటోమేటిక్‌గా వర్తించదు 

పునరుత్పాదక విద్యుత్‌ పెట్టుబడులకు ఈ నిబంధనలు అడ్డంకిగా మారతాయంటున్న నిపుణులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోలార్, విండ్‌ పవర్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి కీలకమైన గ్రిడ్‌ కనెక్టవిటీ బదిలీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) కొత్త షరతులు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌(ఏపీ ట్రాన్స్‌కో) విజ్ఞప్తి మేరకు ఏపీఈఆర్‌సీ ఇచి్చన స్పష్టీకరణలు.. పునరు­త్పాదక విద్యుత్‌ రంగంలో సందిగ్ధ పరిస్థితులకు దారితీస్తున్నాయి. గ్రిడ్‌కు విద్యుత్‌ను సరఫరా చేయడానికి కనెక్టివిటీ అత్యంత కీలకం. ఒక సోలార్‌ లేదా విండ్‌ ప్రాజెక్టును ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థతో అనుసంధానం చేసేందుకు మంజూరయ్యే హక్కునే కనెక్టివిటీగా పరిగణిస్తారు. 

ఈ హక్కును ఒక ప్రాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ చేయడాన్ని కనెక్టివిటీ బదిలీగా వ్యవహరిస్తారు. అయితే, కనెక్టివిటీ అనేది ప్రాజెక్టు నిర్దిష్ట హక్కు మాత్ర­మేనని, దాన్ని స్వేచ్ఛగా ఇతరులకు బదిలీ చేయలే­మ­ని ఏపీఈఆర్‌సీ తాజాగా స్పష్టం చేసింది. క్లస్టర్‌ విధానంలో మంజూరైన కనెక్టివిటీ కూడా అదే క్లస్టర్‌లోని ఇతర ప్రాజెక్టులకు ఆటోమేటిక్‌గా వర్తించదని తేల్చిచెప్పింది. కనెక్టివిటీ బదిలీ, విభజన లేదా కేటాయింపునకు సంబంధించిన ప్రతి ప్రతిపాదనను ఏపీ ట్రాన్స్‌కో.. కేసు వారీగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. 

ప్రాజెక్టుల మధ్య వివాదాలకు ఆస్కారం! 
రాష్ట్ర అంతర్గత ప్రసార వ్యవస్థలో కనెక్టివిటీ బదిలీకి ప్రస్తుతం ప్రత్యేక నిబంధనలు లేవు. కేంద్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌(సీఈఆర్‌సీ) నిబంధనలు నేరుగా వర్తించవని.. వాటి సూత్రాలను మాత్రమే మార్గదర్శకంగా తీసుకోవచ్చని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. దీంతో భవిష్యత్‌లో అనుమతుల ప్రక్రియలో స్పష్టత కంటే అధికారుల విచక్షణకు ఎక్కువ ప్రాధాన్యం లభించే పరిస్థితి ఏర్పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అలాగే ఇప్పటికే వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి.. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు లేదా ఓపెన్‌ యాక్సెస్‌ కింద పనిచేస్తున్న ప్రాజెక్టులకు కనెక్టివిటీ బదిలీకి అవకాశం కల్పించినప్పటికీ.. అసలు కనెక్టివిటీ పొందిన డెవలపర్‌ సమ్మతి తప్పనిసరి అని తేల్చిచెప్పింది. దీంతో ప్రాజెక్టుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  

పెట్టుబడులపై ప్రభావం.. 
కనెక్టివిటీ బదిలీపై కఠిన నిబంధనల వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చితి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పష్టమైన విధానాల కంటే కేసు వారీ పరిశీలనకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రాజెక్టుల అమలు ఆలస్యమయ్యే అవకాశముందని వారు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగాన్ని ప్రోత్సహించాలంటే కనెక్టివిటీ బదిలీపై స్పష్టమైన, పారదర్శక విధానాన్ని ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు రూపొందించాలని సూచిస్తున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement