
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ విజయవాడ దుర్ఘటనలో పలువురు మృతి చెందారని తెలిసి ఎంతో విచారించాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘ఈ ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ విచారం
‘‘విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం కలచివేసింది. ఆప్తులను కోల్పోయిన వారి శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అక్కడి పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్తో చర్చించాను. అన్ని విధాలుగాను సాయం అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాను’’ అని ట్వీట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అగ్నిప్రమాద మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు.
కేంద్రం సాయం : మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధాని ప్రకటించారు.