మీడియాతో మాట్లాడుతున్న విజయలక్ష్మి
చంపేస్తానని సీఐ నాగరాజు చెప్పారు
మార్చురీలో కూడా చూసి వచ్చా..
బతికుంటే కోర్టులో హాజరుపర్చండి.. చంపేస్తే శవాన్ని ఇవ్వండి
విజయవాడ కృష్ణలంక పోలీసులను అర్థించిన ఒక తల్లి
న్యాయవాదులతో కలిసి బీబీఏ కార్యాలయం వద్ద ధర్నా
విజయవాడ లీగల్: ‘నీ కొడుకును చంపేస్తా.. చచ్చిపోయాడనుకో.. వాడిపై ఆశలు వదులుకో... వాడు ఇకపై నీవద్దకు రాడు’.. అంటూ విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు బెదిరించారని మార్కాపురం జిల్లాకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విలపిస్తూ చెప్పారు. తన కుమారుడిని చంపేస్తానని చెప్పడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో కూడా చూసి వచ్చానన్నారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని ఇవ్వాలని కోరారు.
తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె మంగళవారం న్యాయవాదులతో కలిసి విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పోలీసులు గతనెల 9వ తేదీ రాత్రి జిల్లా కేంద్రం మార్కాపురం నుంచి గాదె సాయికృష్ణను విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి నుంచి అతడి సమాచారం ఏమీ తెలియడంలేదన్నారు. తరువాత సీఐ నాగరాజు తీసుకురమ్మన్నారని చెప్పి కృష్ణలంక పోలీసులు తనను మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొచ్చారని తెలిపారు.
తన సెల్ఫోన్ను పోలీసులు లాక్కున్నారన్నారు. ఎన్నిసార్లు పోలీసులకు వద్దకు వెళ్లి తన కుమారుడి గురించి, తన ఫోన్ గురించి అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. తన కొడుకును తీసుకొచ్చి 20 రోజులు దాటిపోయిందని, ఇప్పటికీ కోర్టులో హాజరుపర్చలేదంటే అతడిని చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తన కొడుకు బతికి ఉంటే కోర్టులో హాజరుపరచాలని, చంపేస్తే శవాన్ని అయినా ఇవ్వాలని కన్నీటితో వేడుకున్నారు.
సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చినట్లు నిజనిర్ధారణ అయింది
బీబీఏ మానవహక్కుల కమిటీ చైర్మన్, సీనియర్ న్యాయవాది ఏ.ఎస్.ఎస్.రాంప్రసాద్ మాట్లాడుతూ మార్కాపురం నుంచి 20 రోజుల కిందట అక్రమంగా తీసుకొచ్చిన గాదె సాయికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో పలు కేసులతో సంబంధం ఉన్న గాదె సాయికృష్ణ కొంతకాలంగా మార్కాపురంలో ఉంటున్నాడని తెలిపారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక పోలీసులు అతడిని చిత్రహింసలకు గురిచేశారని అనుమానం వ్యక్తం చేశారు.
విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో బీబీఏ మానవహక్కుల కమిటీ తరఫున కృష్ణలంక సీఐ నాగరాజును అడగగా తాము సాయికృష్ణను తీసుకురాలేదని చెప్పారన్నారు. స్టేషన్ సీసీటీవీ ఫుటేజి ఇవ్వమని కోరినా ఇవ్వలేదని చెప్పారు. బార్ అసోసియేషన్ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మార్కాపురం వెళ్లి విచారించారని, సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని అక్కడివారు చెప్పారని తెలిపారు. సాయికృష్ణ బయటకు రాలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడా? లేక చంపేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.
అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్లో ఉంటే అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచాలేగానీ పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షించడం సరికాదన్నారు. ఇప్పటికైనా కృష్ణలంక పోలీసులు సాయికృష్ణను కోర్టులో హాజరుపర్చకపోతే బాధితురాలి పక్షాన న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. గతంలో ఇలాగే బెజవాడ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లు, లాకప్డెత్లు చేసినప్పుడు బీబీఏ న్యాయవాదులు పోరాటాలు చేసి అటువంటి ఘటనలు తిరిగి జరగకుండా అడ్డుకట్టవేశారని ఆయన గుర్తుచేశారు.


