ఆ పార్టీ ఆఫీసు ముందు కుటుంబంతో మైనార్టీ నేత ఐఎంఎం బాషా నిరసన
ముస్లిం, మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పోస్టు
పోలీసులను ప్రయోగించిన అనంత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్
అనంతపురం టౌన్: ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ముస్లిం, మైనార్టీలకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని న్యాయంగా అడిగా.. ఇందుకు నాపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కక్ష గట్టారు. తన అనుచరులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు కూడా నన్ను స్టేషన్కు తీసుకువెళ్లి దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని ఉంది’ అంటూ టీడీపీ మైనార్టీ విభాగం అనంతపురం నగర మాజీ అధ్యక్షుడు ఐఎంఎం మహబుబ్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా ఆ పార్టీ జిల్లా కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ.. తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఫోన్లో బెదిరించారని తెలిపారు. సోమవారం సాయంత్రం నమాజ్కు వెళ్తే పోలీసులు వచ్చి అనంతపురం వన్ టౌన్ స్టేషన్కు తీసుకెళ్లి పట్టాలివ్వాలని ఎమ్మెల్యేను కోరుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను తొలగింపజేశారన్నారు.
తనకు ఇంటి పట్టాలివ్వాలని తాను అడగలేదని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు నిరుపేద మైనార్టీలకు పట్టాలివ్వాలని అడిగితే దాడులు చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని నిలదీశారు. అనంతపురంలోని ముస్లిం, మైనార్టీలపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులు వివక్ష చూపిస్తున్నారని వాపోయారు. విషయం తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు పార్టీ కార్యాలయానికి చేరుకుని మహబూబ్ బాషాతో మట్లాడి, బుజ్జగించారు. దీంతో బాషా నిరసన దీక్షను విరమించుకున్నారు.


