
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హత ఉన్న 99 శాతం మందికి సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అందించారని.. సాంకేతిక కారణాలతో లబ్ధి పొందని ఒక శాతం లబ్ధిదారులకు కూడా ప్రయోజనం చేయాలన్న లక్ష్యంతోనే ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ చెప్పారు.
శనివారం రాష్టవ్యాప్తంగా ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞ్ఞప్తి చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించారని తెలిపారు. లబ్ధిదారులకు అవసరమైన ధ్రువపత్రాలను అక్కడికక్కడే అధికారులు జారీ చేశారని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే...
దేశ చరిత్రలో ఇదే ప్రథమం: మంత్రి మేరుగు
కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ రూపంలో రూ.2.23 లక్షల కోట్లను జమ చేశారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఉచితంగా జారీ చేయడం, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది, గృహసారథులు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి.. వారి సమస్యలను తెలుసుకుని టోకెన్లు ఇస్తారు. శనివారం నుంచి ఈ నెల 30 వరకూ సచివాలయాల పరిధిలో క్యాంపులు నిర్వహించి.. ప్రజలకు అవసరమైన సర్టిఫికెట్ల జారీ, పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సమస్యలను మండల, సచివాలయ అధికారులు దగ్గరుండి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారు
ఎక్కడైనా మాకు సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారుల వద్దకు వస్తారు. కానీ.. సీఎం వైఎస్ జగన్ మాత్రం అధికారులనే ప్రజల వద్దకు పంపి వారి సమస్యలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించేలా క్యాంపులు ఏర్పాటు చేయడం సుపరిపాలనకు తార్కాణం. ఈ నెలలోనే విద్యార్థులు కళాశాలలకు వెళ్తారు కాబట్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లను ముందుగానే ఇవ్వడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ఆగస్టు నుంచే సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా అమలవుతుంది.