వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం | Medical and Health Transfers Confusion: Andhra pradesh | Sakshi
Sakshi News home page

వైద్యశాఖ బదిలీల్లో గందరగోళం

Jun 3 2025 4:50 AM | Updated on Jun 3 2025 4:50 AM

Medical and Health Transfers Confusion: Andhra pradesh

ఖాళీల విషయంలో స్పష్టత కరువు 

ఆ వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేదెలా అంటూ ఉద్యోగులు అసహనం 

కొందరు బాస్‌లను మేనేజ్‌ చేసుకుంటున్నారని ఆరోపణలు 

రెగ్యులర్‌ అయిన కాంట్రాక్టు సిబ్బంది సీనియారిటీ విషయంలోనూ అయోమయం  

సాక్షి, అమరావతి: వైద్యశాఖలో బదిలీల కోసం శనివారం జారీచేసిన మార్గదర్శకాలు ఉద్యోగులను గందరగోళపరుస్తున్నాయి. రెండేళ్ల సర్విసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం కల్పించారు. ఐదు ఆప్షన్లను ఎంచుకోవాలని సూచించారు. అయితే, రిక్వెస్ట్‌ ట్రాన్స్‌­ఫర్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగుల స్థానాలను ఖాళీలుగా ప్రకటిస్తారా? ఎంచుకున్న ఐదు స్థానాల్లో ఖాళీలేని పక్షంలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి బదిలీ చేస్తారా? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో రెండేళ్ల సర్విసు పైబడిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనే అయోమయం నెలకొంది.

మరోవైపు.. బదిలీ దరఖాస్తుల సమర్పణకు మంగళవారం తుది గడువు విధించారు. అయితే, సోమవారం సాయంత్రానికి కూడా అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఖాళీల వివరాలను ప్రదర్శించనేలేదు. దీంతో ఖాళీల వివరాలు చెప్పకపోతే దరఖాస్తు చేసుకునేదెలా అని వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ముఖ్యంగా డీఎంఈ పరిధిలోని రాష్ట్రస్థాయి కేడర్‌ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్‌ ఖాళీల వివరాలను సోమవారం సాయంత్రం వరకూ ప్రకటించలేదు. మీకేమైనా సమాచారం ఉందా అంటూ వైద్యులందరూ తాము పనిచేస్తున్న కళాశాలల ప్రిన్సిపాల్స్‌ కార్యాలయాల చుట్టూ సోమవారం ప్రదక్షిణలు చేశారు.  

ఖాళీలు చూపకపోవడంపై ఆరోపణలు.. 
ఐదేళ్లు సర్వీసు పూర్తయినప్పటికీ కొందరు వైద్యులు, ఇతర ఉద్యోగులు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లోని పరిపాలన సిబ్బంది, బాస్‌లను మేనేజ్‌ చేసుకుని తమ స్థానాలను ఖాళీలుగా చూపకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఐదేళ్లు పైబడిన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) జాబితాలో కొన్ని స్థానాలు పొందుపరచలేదని తెలుస్తోంది.

ఐదేళ్లు పైబడినప్పటికీ తిరుపతి రుయా, విశాఖ కేజీహెచ్‌లలో ముగ్గురు సీఏఎస్‌ స్థానాలను ఖాళీగా చూపలేదని వైద్యుల నుంచి ఫిర్యాదులున్నాయి. మిగిలిన కేడర్లలోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇక గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేల సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్‌ అయ్యారు. వీరి సీనియారిటీని రెగ్యులరైజ్‌ అయిన నాటి నుంచి పరిగణనలోకి తీసుకుంటారా? లేక మరేదైనా నిబంధనలున్నాయా అనే ప్రస్తావన కూడా చేయకపోవడంతో వీరంతా కూడా అయోమయానికి గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement