
సీఆర్డీఏలో ఇప్పటికే మూడు కన్సల్టెన్సీలకు రూ.86.29 కోట్లు
తాజాగా జోన్–7లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ
రెండేళ్లలో ప్రాజెక్టు పర్యవేక్షణకు రూ.10.60 కోట్లు
ప్రతిపాదనలను ఆహ్వానించిన సీఆర్డీఏ
సాక్షి, అమరావతి: అమరావతిలో కన్సల్టెంట్ల రాజ్యం మళ్లీ వచ్చిoది. గతంలో కన్సల్టెంట్ల పేరిట రూ.వందల కోట్లు వ్యయం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. అమరావతిలో ప్రతి ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీలను నియమిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బుల్లేవంటూనే అమరావతిలో కన్సల్టెంట్లకు భారీగా వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే మూడు కన్సల్టెన్సీలను సీఆర్డీఏ నియమించింది.
కొత్తగా జోన్–7లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కోసం సీఆర్డీఏ ప్రతిపాదనల్ని ఆహ్వానించింది. ప్రతిపాదనల సమర్పణకు వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు విధించింది. అదేరోజు సాంకేతిక బిడ్ను తెరవనున్నట్టు సీఆర్డీఏ తెలిపింది. జూన్ 6న ఆర్థిక బిడ్ తెరుస్తామని స్పష్టం చేసింది. 7వ జోన్లో ల్యాండ్ పూలింగ్ పథకాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని నియమిస్తున్నట్టు పేర్కొంది.
ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు..
ఇప్పటికే జోన్ 2, 4, 6, 10లలో చేపట్టిన ప్రాజెక్టుల పర్యవేక్షణకు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ను సీఆర్డీఏ ఎంపిక చేసింది. ఈ జోన్లలో చేపట్టే ప్రాజెక్టు పనులను పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు తనిఖీ నివేదికలను సీఆర్డీఏకు సమర్పించే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.42.33 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది.
జోన్ 12, 12ఏలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టు పనులు పర్యవేక్షణకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ బాధ్యతలను నిప్పాన్ కోయి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.34.27 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది. అమరావతి రాజధాని ఆర్థికాభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వ్యూహాత్మక నిర్వహణ కన్సల్టెంట్ను సీఆర్డీఏ నియమించింది.
ఈ బాధ్యతను ప్రైస్ వాటర్ హౌస్కూపర్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.9.69 కోట్లకు సీఆర్డీఏ అప్పగించింది. ఇలా ఇప్పటికే రూ.86.29 కోట్లు కన్సల్టెంట్లకు దోచి పెట్టేందుకు నిర్ణయించగా.. తాజాగా ఎంపిక చేయనున్న కన్సల్టెన్సీకి రూ.10.60 కోట్లు చెల్లించనున్నట్టు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ స్పష్టం చేసింది.