శ్రీవారి భక్తులకు చంద్రబాబు, పవన్ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తుమూర్తి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ గురుమూర్తి ట్వీట్ చేశారు.
‘‘ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హిందువులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. అలాంటి ప్రసాదాన్ని జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేశారని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపిస్తే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిజమే అని బలపరిచారు. అయితే నిజం ఏంటో , టీడీపీ, జనసేన పార్టీల భాగస్వామ్యంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని సీబీఐ, ఈడీ విచారణ సంస్థలు తేల్చి చెప్పాయి.
శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల కొవ్వు పదార్థాలు లేనే లేవని మొన్న సీబీఐ, నేడు ఈడీ తేల్చి చెప్పడం ద్వారా కోట్లాది మంది హిందువులు మనసులోని భారాన్ని దించుకున్నారు. కానీ కొన్ని నెలలపాటు తీవ్ర ఆవేదనకు గురి చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, అలాగే టీడీపీ, జనసేన నేతలంతా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి, కోట్లాది మంది హిందువులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తిరుమలకు వెళ్లి దేవదేవుని ఎదుట తప్పైందని చెంపలేసుకోవాలి. ఇది యావన్మంది హిందువుల డిమాండ్’’ అని గురుమూర్తి తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం కాన్వాయ్పై టమాటాలు, గుడ్లు విసిరేందుకు యత్నం.. ఉద్రిక్తత


