లోకేశ్‌ ‘రెడ్‌ డైరీ’ కేసు 30కి వాయిదా  | Lokeshs Red Dairy case adjourned to 30 | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ ‘రెడ్‌ డైరీ’ కేసు 30కి వాయిదా 

Jan 24 2024 5:42 AM | Updated on Jan 24 2024 5:42 AM

Lokeshs Red Dairy case adjourned to 30 - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో కుంభకోణాలపై కేసుల దర్యాప్తును ప్రభావితం చేసేలా, కీలక సాక్షులను భయభ్రాంతులకు గురిచేసేలా నారా లోకేశ్‌.. అధికారులను బెదిరిస్తున్నారన్న సీఐడీ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. గతంలో ఆయనకు ఇచ్చిన 41ఏ నోటీసులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో 41ఏ నోటీస్‌ కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బెదిరించిన విషయాన్ని ఆధారాలతో సహా నివేదించింది. రెడ్‌ డైరీ పేరుతో కీలక సాక్షులను బెదిరిస్తున్న లోకేశ్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలని పిటిషన్‌లో కోరింది. కాగా ఈ కేసులో జారీ చేసిన నోటీసులను తీసుకునేందుకు లోకేశ్‌ సుము­ఖత చూపలేదు.

ఆ నోటీ­సులు అందించేందుకు వెళ్లిన సీఐడీ అధికారులకు ఆయన అందుబాటులోకి రాలేదు. దాంతో నోటీసులను పోస్టులో లోకేశ్‌ నివాసానికి పంపారు. ఆ నోటీసులను తీసుకునేందుకు లోకేశ్‌ నిరాకరించారు. నోటీసులను లోకేశ్‌ మొబైల్‌ నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించినా కూడా ఆయన స్పందించలేదు. దాంతో ఆ విషయాన్ని కూడా సీఐడీ అధి­కా­రులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు.

దాంతో న్యాయస్థానం ద్వారా నోటీ­సులు జారీ చేయాలని కోర్టు రిజిస్ట్రార్ ను న్యాయమూర్తి ఆదేశించారు. లోకేశ్‌ గానీ, ఆయన తరఫు న్యాయవాదులు గానీ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని లోకేశ్‌ తరఫు న్యాయవాదులు ఏసీబీ న్యాయస్థానాన్ని మంగళవారం కోరారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement