
వేటపాలెం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని లోక్సత్తా నేత ఎన్.జయప్రకాష్ నారాయణ చెప్పారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వేటపాలెంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతాబ్ది ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకోసం ఒక్కో విద్యార్థికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం అత్యధికంగా ఒక్కొక్క విద్యార్థికి రూ.90 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు.
ఇది అభినందించాల్సిన విషయమన్నారు. విద్యా, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ బండ్ల బాపయ్యశెట్టి నెలకొల్పిన విద్యాసంస్థలో చదువుకున్న ఎందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయిల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని రాణించాలని సూచించారు.
ఎన్ఏటీసీవో డైరెక్టర్ చెంగపల్లి వెంకట్, నటుడు అజయ్ఘోష్, విద్యాసంస్థ అధ్యక్షుడు బండ్ల అంకయ్య, ఉపాధ్యక్షుడు కోడూరి ఏకాంబేశ్వరబాబు, కార్యదర్శి బండ్ల శరత్బాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ గొల్లపూడి సీతారాం తదితరులు పాల్గొన్నారు.