
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కూటమి సర్కార్కు ఊహించని పరిణామం ఎదురైంది. ఎయిర్పోర్టు కోసం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణకు దిగింది. ఈ నేపథ్యంలో తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబును గెలిపించినందుకు తమకు తగిన బుద్ధి చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం బలవంతపు భూసేకరణ చేపట్టింది. రామకుప్పం, శాంతిపురం మండలాల్లో భూసేకరణ చేస్తోంది. శాంతిపురం మండలం దండికుప్పంలో బలవంతంగా భూసేకరణకు కూటమి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రెవెన్యూ అధికారులు అక్కడ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. దీంతో, రెవెన్యూ అధికారులను రైతులు అడ్దుకున్నారు. ప్రభుత్వానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్బంగా రైతులు మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబును గెలిపిస్తున్నందుకు మాకు తగిన బుద్ధి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, అధికారులు మాత్రం.. ఎకరాకు 16 లక్షలు ఇస్తామని రైతులను బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమను ప్రశ్నిస్తే, కోర్టులకు వెళ్తే రూ.10లక్షలు మాత్రమే ఇస్తామని రెవెన్యూ అధికారులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.

కాగా, కుప్పంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం 1405 ఎకరాలు భూ సేకరణ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా భూసేకరణకు దిగింది. ఇప్పటికే 458 ఎకరాలు భూమి సేకరించింది. అదనపు భూమి కోసం రైతులను వేధింపులకు గురిచేస్తోంది.