మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం | Sakshi
Sakshi News home page

మహిళలు, బాలికల పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యం

Published Wed, Sep 8 2021 2:36 AM

Kritika Shukla Comments About Swecha Scheme - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ‘స్వేచ్ఛ’ పథకాన్ని అమలు చేస్తోందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలు కృతికా శుక్లా తెలిపారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలు, బాలికల పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. స్వేచ్ఛ పథకం ద్వారా కిశోర బాలికలకు ఈనెల నుంచి ఉచితంగా న్యాప్కిన్‌ల పంపిణీకి ప్రభుత్వం రూ.31.48 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాల్లో చదువుతున్న సుమారు 10 లక్షల మంది కిశోర బాలికలకు న్యాప్కిన్‌లను అందిస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి పదేసి న్యాప్కిన్‌లను అందిస్తామన్నారు. దీని వల్ల రుతుక్రమం సమయంలో పాఠశాల, కాలేజీ మానేసే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు వారి పరిశుభ్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందన్నారు. న్యాప్కిన్‌ల పంపిణీ కోసం ఆయా విద్యా సంస్థల్లో ఒక మహిళా ఉపాధ్యాయురాలిని, అధ్యాపకురాలిని నోడల్‌ అధికారిగా నియమించినట్టు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వైఎస్సార్‌ చేయూత స్టోర్స్‌లో నాణ్యమైన న్యాప్కిన్‌లను తక్కువ ధరకు విక్రయించేలా నిర్ణయం తీసుకున్నట్టు కృతికా శుక్లా తెలిపారు.
 

Advertisement
Advertisement