విజయవాడ: కృష్ణలంక సీఐ వేధింపుల వల్లే తన భర్త చనిపోయాడని క్రాంతి కుమార్ భార్య ప్రభావతి చెప్పారు. స్టేషన్కు పిలిచినప్పుడల్లా చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. తాళ్లతో చేతులు కట్టి, ఒళ్లంతా కుళ్లబొడిచేవారని చెప్పారు. పోలీసులు దారుణంగా కొడుతున్నారని తన భర్త గతంలో కూడా చెప్పారని అన్నారు.
చనిపోవడానికి ముందు కూడా సీఐ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని తనకు క్రాంతి కుమార్ ఫోన్ చేశారని తెలిపారు. తన భర్త చావుకు ముమ్మాటికీ సీఐ నాగరాజే కారణమని అన్నారు. నాగరాజును సస్పెండ్ చేయడం కాదు.. ఉరితీయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు పిల్లలతో ఇప్పుడు తాను ఎలా బ్రతకాలని నిలదీశారు. ప్రభుత్వమే తనను, తన పిల్లల్ని ఆదుకోవాలని కోరారు.


