Key Decisions Approved In Cabinet Meeting Chaired By CM YS Jagan, Complete Details Inside - Sakshi
Sakshi News home page

CM YS Jagan Cabinet Meeting: 54 వేల ఎకరాల 'భూ పంపిణీ'

Published Thu, Jul 13 2023 3:43 AM

Key decisions approved in cabinet meeting chaired by CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుపేదలు, అసైన్డ్, సర్వీస్‌ ఇనామ్, లంక భూముల రైతులకు భారీ మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తద్వారా భూములకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయనంత మేలు రైతులకు చేకూరనుంది. ఈ నిర్ణయా­లకు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో మంత్రి మండలి ఆమో­దం తెలిపింది.

దివంగత సీఎం వైఎస్సార్‌ తర్వాత మళ్లీ భూ పంపిణీకి సీఎం జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. 54,129.45 ఎకరాలను భూమిలేని దళిత, బడుగు బలహీన వర్గాలకు చెందిన 46,935 మంది నిరుపేదలకు పంపిణీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అసైన్డ్‌ భూముల రైతులకు యాజమాన్య హక్కులను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.

భూమిని ప్రభుత్వం కేటాయించి (అసైన్‌ చేసి) 20 ఏళ్లు పూర్తయిన అనంతరం ఆ భూమిపై సంబంధిత రైతులు, వారి వారసులకు పూర్తి యాజ­మాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టా భూముల రైతుల మాదిరిగానే అసైన్డ్‌ భూముల క్రయ, విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం వాస్తవంగా ఎవరికైతే భూమిని కేటాయించిందో వారికి యాజమాన్య హక్కు దక్కుతుంది.

వారు లేని పక్షంలో వారి వారసులకు హక్కులు రానున్నాయి. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం చేకూరనుంది. ఇంకా మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాల గురించి సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఆ కుల వృత్తుల వారికి శుభవార్త
మూడు కేటగిరీల్లోని 9,062 ఎకరాల లంక భూముల రైతులకు డీ పట్టాలు ఇవ్వడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కొన్ని భూములను ఐదేళ్లు లీజు ఇవ్వడానికి అనుమతించారు. ఈ నిర్ణయంతో 19,176 మంది రైతులకు మేలు చేకూరునుంది. పేదలకు భూ పంపిణీ, లంక భూములకు డీ పట్టాలు ఇవ్వడం ద్వారా మొత్తంగా 63,191 ఎకరాలకు సంబంధించి 66,111 మందికి లబ్ధి చేకూరనుంది.

గ్రామాల్లో కుల వృత్తులు చేసుకునే వారికి ఇచ్చిన సర్వీస్‌ ఈనామ్‌ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కుమ్మరి, చాకలి, కమ్మరి, నాయీబ్రాహ్మణ (బార్బర్‌) తదితర కుల వృత్తులు చేసుకునే వారికి గతంలో ఈనామ్‌గా ఇచ్చిన భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. వీటిని ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగింపు ద్వారా వారికి సర్వ హక్కులు కల్పించనున్నారు.

1,68,603.71 ఎకరాల భూములు నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించడం ద్వారా 1,13,610 మందికి ప్రయోజనం కలుగనుంది. 2013కు ముందే వీరందరూ రైత్వారీ పట్టాలు పొందారు. ఆ తర్వాత ఈ భూములపై ఆంక్షలను విధించారు. ఇప్పుడీ ఆంక్షలన్నీ తొలగిపోనున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీమ్‌ కింద గతంలో 16,213 ఎకరాలు పొందిన దళితులకు సానుకూలంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

14,223 మందికి సంబంధించి కట్టాల్సిన రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు కూడా కూడా మాఫీ చేయడం ద్వారా దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములపై వారికి పూర్తి హక్కులు లభించనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో దళితులకు హక్కు పత్రాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేపడుతోంది.  
అంతిమ సంస్కారానికి దిగులుండదు 
గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికల కోసం భూములు కేటాయిస్తూ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 1,966 రెవిన్యూ గ్రామాల్లో ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవని సర్వే ద్వారా గుర్తించిన ప్రభుత్వం.. ఇందులో 1,700 రెవిన్యూ గ్రామాల్లో అందుబాటులో ఉన్న 1,050.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎకరం వరకు భూ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. మరో 266 రెవిన్యూ గ్రామాలకు భూ సేకరణ చేసి ఇవ్వనున్నారు. ఇందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ నెలలో అమలు చేసే కార్యక్రమాలకు ఆమోదం 
► ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు నాలుగో ఏడాది మొదటి విడత కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. 5.1 లక్షల మందికి రూ.510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ, వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి  రూ.10.03 కోట్లు చెల్లించనున్నారు.

► ఈ నెల 21న నేతన్న నేస్తం పథకం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు. వరుసగా ఐదో ఏడాది ఈ పథకం అమలు ద్వారా 80,686 మందికి దాదాపు రూ.300 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుంది.

► ఈ నెల 24న సీఆర్డీయే ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 50,793 మందికి ప్రభుత్వం 1,366.48 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కాగా, 47,017 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. పేదల ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.384.52 కోట్లు కేటాయింపునకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

► ఈ నెల 26న వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల మహిళలకు డబ్బు జమ చేయనుంది.  వరుసగా నాలుగో ఏడాది పంపిణీ చేపట్టనున్నారు. 9.48 లక్షల గ్రూపుల్లోని మహిళలకు ఈ పథకం కింద రూ.1353.76 కోట్లు ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం సుమారు రూ.5 వేల కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చినట్లు అవుతుంది. 

► ఈ నెల 28న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన లబ్ధిదారులకు రూ.50 కోట్ల మేర జమ చేయనున్నారు. 

ఇక ఓపికున్నంత వరకు అర్చకత్వం  
దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు ఓపిక, శక్తి ఉన్నంత వరకు భగవంతుడి సేవలో కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అర్చకులకు రిటైర్మెంట్‌ లేకుండా చట్ట సవరణ చేసేందుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే దేవదాయ శాఖ ఉద్యోగులకు కూడా ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు నిర్ణయించింది.

వైద్య రంగంలో పోస్టుల భర్తీ
2024–25 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో కొత్తగా ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. పులివెందుల, పాడేరు, ఆదోని మెడికల్‌ కాలేజీలకు గత మంత్రివర్గ సమావేశంలో పోస్టులు మంజూరు చేశారు. మిగిలిన రెండు చోట్ల.. మదనపల్లి, మార్కాపురం వైద్య కళాశాలలు ప్రారంభించడానికి వీలుగా కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 1,412 పోస్టుల సృష్టికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సీఎం జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఇప్పటికే 5 వైద్య కళాశాలలను ఈ విద్యా సంవత్సరం(2023–24) నుంచి ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌ వ్యాధి నియంత్రణ, చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కర్నూలులో కేన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు 247 పోస్టులు మంజూరు చేస్తూ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వం ప్రజా వైద్యాన్ని బలోపేతం చేస్తోంది.

పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకూడదని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి నివేదిక ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వ విభాగంలో కలిపేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

విశాఖపట్నంలో విమ్స్‌.. మెడికల్‌ కాలేజీగా మార్పు, ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో కార్డియాలజీ, కేథ్లా్బŠ, సీటీవీసీ విభాగాల్లో 94 పోస్టుల మంజూరు, పుంగనూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేసేందుకు అనుమతించింది.

పునరావాసానికి ప్రత్యేక చర్యలు
వైఎస్సార్‌ జిల్లాలో 10,231 గండికోట ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీ కింద రూ.454.6 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఫేజ్‌ 2, 3లోని ముంపు బాధితుల తరహాలోనే ఫేజ్‌1 బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు సహాయ పునరావాస పనుల కోసం ప్రత్యేక ఇంజినీరింగ్‌ విభాగం ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సిబ్బంది పని చేస్తున్నారు. ఇందుకు గాను 73 పోస్టులను కేబినెట్‌ ఆమోదించింది. వీటికి అదనంగా 6 ఔట్‌ సోర్సింగ్‌ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. 

పరిశ్రమల స్థాపన.. ఉద్యోగాల కల్పన
► వైఎస్సార్‌ జిల్లా వేంపల్లిలో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థ రూ.8,104 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న 1,500 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు కేబినెట్‌ ఆమోదం. దీని ద్వారా 1500 ఉద్యోగాల కల్పన జరగనుంది. 

► హీరో ప్యూచర్స్‌కు చెందిన క్లీన్‌ ఎనర్జీ ప్రైయివేటు లిమిటెడ్‌ సోలార్, విండ్‌ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పేందుకు ఆమోదం. ఈ సంస్థ 375 మెగావాట్ల సామర్థ్యంతో అనంతపురం, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో రూ.2,450 కోట్ల పెట్టుబడితో పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 375 మందికి ఉద్యోగాల అవకాశాలు దక్కుతాయి.

► రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఐఐసీ పరిధిలోని వివిధ పరిశ్రమలకు 352.79 ఎకరాల భూముల కేటాయింపులకు సంబంధించి 44 ప్రతిపాదనలకు ఆమోదం. ఇందులో రూ.4,204.07 కోట్ల పెట్టుబడుతో 4,705 మందికి ఉపాధి దక్కనుంది. వీటితో పాటు ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు కూడా ఆమోదం లభించింది.

► శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణానికి అవరసరమైన వనరుల సమీకరణకు ఏపీ మారిటైం బోర్డు రూ.3,884.70 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం.  

► ఏపీ మారిటైం బోర్డులో రెండు ఇంజినీరింగ్‌ పోస్టులు, ఎస్‌ఐపీబీలో ఆమోదించిన టూరిజం ప్రాజెక్టులకు, చెన్నై– కడప, విజయవాడ–కడప, బెంగళూరు–కడప, విశాఖపట్నం– కడప మధ్య విమానాలు నడుపుతున్న ఇండిగో సంస్థకు మరో ఏడాది పాటు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కొనసాగింపునకు కేబినెట్‌ అంగీకారం.

మరిన్ని అంశాలకు ఆమోదం
► నంద్యాల జిల్లా బేతంచర్ల, అనంతపురం జిల్లా గుంతకల్, వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 128 టీచింగ్‌ పోస్టులు, 68 నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల మంజూరుకు ఆమోదం. ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 26, ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 నైపుణ్యాభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటన్నింటికీ ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా పాఠ్య ప్రణాళికను రూపొందించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు.  

► జేఎన్‌టీయూ కాకినాడలో 27 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ నియామకానికి ఆమోదం. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు. రిటైర్‌ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవాలని నిర్ణయం. కోర్టు కేసుల దృష్ట్యా పోస్టుల భర్తీలో భారీ జాప్యం ఉంటోంది. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా 62 ఏళ్లకు రిటైర్‌ అవుతున్న బోధనా సిబ్బంది సేవలను 65 ఏళ్ల వరకు కాంట్రాక్టు పద్ధతిలో వినియోగించుకోవడానికి కేబినెట్‌ ఆమోదం.

► టోఫెల్‌ పరీక్షల కోసం ప్రభుత్వ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం కోసం విఖ్యాత విద్యా సంస్థ ఎడ్యుకేషనల్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌(ఈటీఎస్‌)తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదం. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఈటీఎస్‌. సన్నాహక పరీక్షలతోపాటు టోఫెల్‌ ప్రైమరీ, జూనియర్‌ స్థాయి పరీక్షలను ఈటీఎస్‌ నిర్వహించనుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని తట్టుకునేలా ప్రాథమిక స్థాయి నుంచే మన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. ఈ శిక్షణను ప్లస్, ప్లస్‌ వన్‌ స్థాయికి  విస్తరించనున్నారు. ఈ నెల 23 నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లో టోఫెల్‌పై శిక్షణ ప్రారంభం కానుంది. 

► స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్, ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టి)ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్‌సీఈఆర్‌టీలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో తొమ్మిది అకడమిక్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల నియామకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  

► కొత్తగా ఏర్పాటు చేసిన తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లో 19 పోస్టుల మంజూరు, కొత్తగా ఏర్పాటైన ఒంగోలు, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, విజయనగరం, మచిలీపట్నం సౌత్‌ మండలాల్లో 70 పోస్టులు, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 13 స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం.

► మచిలీపట్నం, గుడివాడల్లో ఆరు కాలనీల్లో 1970–80 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మార్కెట్‌/నామినల్‌ విలువపై భూములు కేటాయిస్తూ అప్పుడు పేర్కొన్న నిబంధనలను సవరించేందుకు ఆమోదం. 

► రాష్ట్ర మానవ హక్కుల సంఘంలోని దర్యాప్తు విభాగానికి కేటాయించిన 9 పోస్టుల మంజూరుతో పాటు, మరో 21 పోస్టులకు కేబినెట్‌ ఆమోదం.

► విశాఖ భూముల అక్రమాలకు సంబంధించి ముగ్గురు సభ్యుల సిట్‌ కమిటీ ఇచ్చిన తొలి నివేదికలోని 69 సిఫార్సులను కేబినెట్‌ ఆమోదించింది. ఇందులో మరో 18 సిఫార్సులపై మరింత శోధన అవసరమన్న సిట్‌ నివేదికకు సమ్మతి వ్యక్తం చేసింది.  

Advertisement
Advertisement