సాక్షి, విజయవాడ: ఏపీలో నకిలీ మద్యం అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదలయ్యారు.
అనంతరం, జైలు వద్ద జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. నన్ను 83 రోజులు జైలులో పెట్టారు. జైలులో సామన్య ఖైదీగా ఇబ్బంది పెట్టారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశాను అని చెప్పుకొచ్చారు. నెల్లూరు, మదనపల్లి, విజయవాడ జైళ్ల చుట్టూ తిప్పారు. నార్కో అనాలసిస్, లైడిటెక్ట్ టెస్టులకు సిద్దమని చెప్పాను అని అన్నారు. రాక్షసానందం కోసం నన్ను, నా సోదరుడిని అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్లకు భయపడేది ప్రసక్తే లేదు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఫేక్ సీఎం. సంబంధం లేని కేసులో ఇరికించారు.
అక్రమ కేసులు పెట్టి నన్ను, నా సోదరుడిని 83 రోజులు జైల్లో పెట్టారు. నాతో పాటు నా కుటుంబాన్ని సైతం ఇబ్బంది పెట్టారు. నా భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారు. కేసులు, అరెస్టులతో మమ్మల్ని భయపెట్టలేరు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా. ఇకపై పూర్తిగా ప్రజల్లోనే ఉంటాం. ప్రభుత్వ మోసాలను ఎండగడతాను. లోకేష్ నీ రెడ్బుక్ను మడిచిపెట్టుకో. మీ బెదిరింపులకు భయపడే వారెవరూ లేరు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చే వరకూ పోరాడతాం. వైఎస్ జగన్ని సీఎంగా చేసుకుని తీరుతాం. చంద్రబాబు, లోకేష్కు మరోమారు సవాల్ చేస్తున్నా. వారం రోజులు టైమ్ ఇస్తున్నా. మీకు దమ్ముంటే బెజవాడ దుర్గమ్మ సాక్షిగా సత్య ప్రమాణం చేద్దాం రండి. దావోస్ వెళ్లి సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆసుపత్రుల్లో మందులు లేక జనం ప్రాణాలు పోతున్నాయి. రైతులు గిట్టుబాటు ధరలేక అల్లాడిపోతున్నారు. విద్యార్ధులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక అవస్థలు పడుతున్నారు అని వ్యాఖ్యానించారు.
ఇబ్రహీంపట్నం..
- ఇబ్రహీంపట్నం సర్కిల్కి భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు.
- మరికొద్దిసేపట్లో ఇబ్రహీంపట్నం చేరుకోనున్న జోగి రమేష్..
- జోగి రమేష్కి స్వాగతం పలికేందుకు భారీగా చేరుకున్న అభిమానులు
- న్యాయం గెలిచింది అంటూ నినాదాలు చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
ఇదిలా ఉండగా.. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్నీ అధికార టీడీపీ నేతల కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైనా, డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దేపల్లె జనార్దనరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. అనంతరం, జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము పోలీసులు అరెస్టు చేశారు.


