ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్‌ జగన్‌ | YS Jagan Meeting With YSRCP Eluru Constituency Party Cadre In Tadepalli, Key Comments News Updates | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర: వైఎస్‌ జగన్‌

Jan 21 2026 9:54 AM | Updated on Jan 21 2026 4:37 PM

Jagan Meeting With YSRCP Eluru Party Cadre Key Comments News Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ప్రజలందరూ వైఎస్సార్‌సీపీ వైపే చూస్తున్నారు. కేడర్‌ అంతా.. తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. 

ఈరోజు(బుధవారం, జనవరి 21వ తేదీ)  ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జయ ప్రకాశ్‌, కారుమూరి సునీల్‌, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించి కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఏ ఒక్క వర్గానికి ఏ మేలు చేయని ప్రభుత్వం ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు తోడుగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. విద్యార్థులు, రైతులు, యువత, అక్కచెల్లెమ్మలు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతున్నాం. జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్‌ ఉంటే, ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతాను. అలా దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటాను.

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?..
ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతాను. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలే.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీస్‌ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది

జగన్‌ ఉన్నప్పుడే బాగుండేది, ఆయన ప్రతి నెలా బటన్‌ నొక్కేవాడు. చెప్పింది చేసే వాడు. మాట నిలబెట్టుకునేవాడు. అన్నీ ఇచ్చేవాడు అని ప్రజలంతా, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు. మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ కష్టాలున్నా ప్రజలను ఇబ్బందిపెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. మాట నిలబెట్టుకున్నాం. ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారు. మరోవైపు వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూల్స్‌ పూర్తిగా కళ తప్పాయి. మన హయాంలో గవర్నమెంటు స్కూల్స్‌, ప్రైవేటు పాఠశాలతో పోటీ పడే స్థితి ఉంటే.. ఇప్పుడు అంతా రివర్స్‌ అయింది.

కూటమి పాలనలో సంక్షేమం సున్నా.. 
నాడు మన హయాంలో గవర్నమెంట్‌ స్కూల్లో దాదాపు 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు కేవలం 33 లక్షల మంది మాత్రమే చదువుతున్నారు. ఇక, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎనిమిది క్వార్టర్లు పెండింగ్‌లో పెట్టారు. రూ.5600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.700 కోట్లు ఇచ్చారు. వసతి దీవెన కింద రూ.2200 కోట్లు బకాయి పెట్టారు. ఆరోగ్య శ్రీ కనుమరుగు చేశారు. 108, 104 సర్వీసులు నిర్వీర్యం చేశారు. కోవిడ్‌ టైమ్‌లో కూడా అన్ని సదుపాయాలతో మనం కొత్త వాహనాలు ప్రవేశపెడితే.. వాటిని ఇవాళ పడకేయించారు. ఇప్పుడు టీడీపీకి, డాక్టర్ల వింగ్‌కు చెందిన వారికి సర్వీసులు అప్పగించారు. ఇప్పుడు ఆ సర్వీసుల కోసం ఫోన్‌ చేస్తే, మూడు గంటలైనా రావడం లేదు.

పాదయాత్రపై జగన్ క్లారిటీ

ప్రైవేటుకు ప్రభుత్వ జీతాలా?
మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో పెద్ద కుంభకోణానికి తెరతీశారు. మన ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టాం. పూర్తైన 10 మెడికల్‌ కాలేజీలను ఈ ప్రభుత్వం అచ్చంగా ప్రైవేటీకరిస్తోంది. అంతే కాకుండా ఆ మెడికల్‌ కాలేజీల్లో రెండేళ్ల పాటు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. ఒక మెడికల్‌ కాలేజీలో జీతాలకు ఏటా రూ.60 కోట్లు కావాలి. అలా రెండేళ్లకు రూ.120 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వడమే కాకుండా, రెండేళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారట. అంటే కాలేజీ ప్రభుత్వానిది. అలాగే ప్రభుత్వ స్టాఫ్‌. ఇంకా నిర్వహణ ఖర్చు ప్రభుత్వానిది. కానీ, లాభాలు మాత్రం ప్రైవేటువారికి వెళ్తాయి. ఇలాంటి స్కామ్‌కు పాల్పడిన వారిని, మేము రాగానే రెండు నెలల్లోనే చర్య తీసుకుంటామనగానే.. ఆ కాలేజీలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

వ్యవసాయ రంగాన్ని కూడా నాశనం చేశారు. చివరకు ఎరువులు కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. అత్యంత కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నాశనం కాగా, తాజాగా నాలుగో వ్యవస్థ శాంతి భద్రతలను కూడా నాశనం చేశారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయింది. ఎక్కడా పోలీసింగ్‌ వ్యవస్థ కనిపించడం లేదు. ఇంకా మొత్తం ప్రైవేటీకరణ.. అదే అనుకుంటే చివరకు సీఎం పదవిని కూడా ప్రైవేటుకు ఇవ్వొచ్చు కదా?. అన్నింటా విఫలమైన ప్రభుత్వం.. ప్రశ్నించే గొంతు నొక్కుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, కేసులతో వేధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ప్రజలకు తోడుగా నిలబడుతోంది. విద్యార్థులు, యువత, రైతులు, అక్క చెల్లెమ్మలు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా, వారందరి తరపున జెండా పట్టుకుని నిలబడుతున్నాం. గట్టిగా పోరాడుతున్నాం. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగాలి. ఆ దిశలో మీరంతా కలిసికట్టుగా పని చేయాలి’ అని అన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement