
సుప్రీంకోర్టుకు వెల్లడించిన సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది. పిటిషనర్ తరఫున వాదనలేంటని ధర్మాసనం ప్రశ్నించగా.. సునీతారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది మరో కోర్టులో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నందున పాస్ ఓవర్ ఇవ్వాలని మరో న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం తర్వాత బెంచ్ కూర్చోవడం లేదు కాబట్టి మరో రోజు వాదనలు వింటామని స్పష్టం చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.