పచ్చ పార్టీలో కొత్త రచ్చ | Internal Conflicts Between East Godavari TDP Leaders, Know More Details Inside | Sakshi
Sakshi News home page

పచ్చ పార్టీలో కొత్త రచ్చ

Jun 21 2025 12:25 PM | Updated on Jun 21 2025 1:30 PM

Internal Conflicts Between East Godavari TDP Leaders

పెందుర్తి, వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య ఉప్పునిప్పు

 ఆజ్యం పోస్తున్న సీనియర్‌ గోరంట్ల

సాక్షి తూర్పు గోదావరి : తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. చంద్రబాబునాయుడు అనుసరించే రెండు కళ్ల సిద్ధాంతం సొంత పార్టీ నేతల మధ్య అగాధాన్ని పెంచుతోంది. పార్టీలో సీనియర్‌ నాయకులుగా భుజకీర్తి తగిలించుకుని తిరిగేవారు సైతం ఈ అగాధాన్ని మరింత పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో పెందుర్తి వెంకటేష్‌, బొడ్డు వెంకటరమణచౌదరిల మధ్య పదవులు కేటాయింపు విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఈ రెండు వర్గాలు తమ ప్రాధాన్యాన్ని చాటుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య ఏర్పడే వివాదాలను సైతం ఇరువర్గాలు ప్రెస్టేజీయస్‌గా పరిగణిస్తున్నాయి. తమ వ్యతిరేకవర్గం వారిని పోలీసుల సాయంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో రూరల్‌ నియోజకవర్గం పరిధిలోని తొర్రేడు గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరిల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో సీఎం ప్రోగ్రాం కన్వీనర్‌ పెందుర్తి వెంకటేష్‌ ఫొటో లేదని, ఆయన కుమారుడు అభిరామ్‌ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో వారికి వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పార్టీ సీనియర్‌ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సర్దుబాటు చేసే ప్రయత్నం చేయకపోగా స్వంత పార్టీ కార్యకర్తలపైనే రాజానగరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయించడం ప్రస్తుత వివాదాన్ని మరింత పెద్దది చేసింది. 

బుచ్చయ్య ఇలా ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తూ మరో వర్గం వారిపై కేసులు పెట్టించడం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న తమ నాయకుడి ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో బుచ్చయ్య ప్రమేయం కూడా ఉందని పెందుర్తి వర్గీయులు అనుమానిస్తున్నారు. గోరంట్ల రవిరామ్‌కిరణ్‌ ఫొటో పెట్టగా లేనిది సీఎం ప్రోగ్రాం కన్వీనర్‌గా ఉన్న తమ నాయకుడి ఫొటో ఎందుకు ఫ్లెక్సీలో పెట్టకూడదని పెందుర్తి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

 అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని, పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను పెందుర్తి వర్గీయులు ధ్వంసం చేయడం ముమ్మూటికీ తప్పేనని పార్టీలో పలువురు అభిప్రాయపడుతున్నారు. బొడ్డు వెంకట రమణ చౌదరి, పెందుర్తి వెంకటేష్‌ వర్గీయుల మధ్య ఉన్న వివాదాలను మరింత పెంచే విధంగా గోరంట్ల వ్యవహరించడాన్ని కూడా పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీలో ప్రాధాన్యమైన పదవులు కేటాయించే సమయంలో తనకు పెందుర్తి అడ్డురావచ్చన్న భావనతోనే అక్కడ బొడ్డు వెంకటరమణచౌదరిని బుచ్చయ్య ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. మొత్తమ్మీద ప్రస్తుత వివాదంలో గోరంట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది.

ఫ్లెక్సీల చించివేతపై కేసు నమోదు
తొర్రేడు గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు, ప్రోగ్రాం కన్వీనర్‌ పెందుర్తి వెంకటేష్‌ ఫొటో వేయలేదని ఆయన కుమారుడి అనుచరులు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరిల ఫొటోలు గురువారం చించివేశారు. దీనిపై తొర్రేడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు ముగ్గళ్లకు చెందిన గెడ్డం అనిల్‌కుమార్‌, కాటవరానికి చెందిన కాట్రగడ్డ శివ, తొర్రేడు గ్రామానికి చెందిన చిట్టూరి సురేంద్రలపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement