ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు

Increase in salary of SC Gurukul teachers - Sakshi

1,791 మంది పార్ట్‌ టైమ్‌ టీచర్లకు ప్రయోజనం

పీఈటీ, హెల్త్‌ సూపర్‌వైజర్ల వేతనాలూ పెంపు  

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి  

సాక్షి, అమరావతి: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న 1,791 మంది పార్ట్‌ టైమ్‌ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్‌ సూపర్‌ వైజర్ల వేతనాలు కూడా పెంచినట్టు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ అంబేడ్కర్‌ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఈటీలు, హెల్త్‌ సూపర్‌ వైజర్ల వేతనాలు పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గతంలో జూనియర్‌ లెక్చరర్ల(జేఎల్‌)వేతనం రూ.18 వేలు ఉండగా.. దీనిని రూ.24,150కు పెంచినట్టు తెలిపారు.

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల(పీజీటీ) వేతనం రూ.16,100 నుంచి రూ.24,150కు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల(టీజీటీ) వేతనం రూ.14,800 నుంచి రూ.19,350కు, వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా.. దానిని రూ.16,350కు పెంచినట్టు చెప్పారు. వీరితో పాటు హెల్త్‌ సూపర్‌ వైజర్, స్టాఫ్‌ నర్స్‌ల వేతనం రూ.12,900 ఉండగా దాన్ని రూ.19,350కు పెంచామన్నారు.

కాగా, తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు, టీచర్లు మంత్రి మేరుగు నాగార్జునను శుక్రవారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ నాగభూషణం మాట్లాడుతూ తాము కోరిన వెంటనే న్యాయం చేశారని కొనియాడారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top