కాకినాడ జిల్లాలో మద్యం మత్తులో యువకుడి దారుణం
పిఠాపురం: మంచినీళ్లివ్వలేదనే కోపంతో ఓ కొడుకు తన తల్లిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె పది రోజుల పాటు మంచాన పడి, నరక యాతన అనుభవించి, చివరకు కన్ను మూసింది. ఈ విషాద ఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన పెంటా త్రిమూర్తులు, నాగమణి (45) దంపతులకు ఇద్దరు కుమారులు. త్రిమూర్తులు కూరగాయల వ్యాపారి. వీరి పెద్ద కుమారుడు గతంలో ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
చిన్న కుమారుడు రాజబాబు జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నెల 9న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజబాబుకు తల్లి నాగమణి భోజనం వడ్డించగా..తింటూ ఫ్రిజ్లో చల్లటి మంచినీళ్లు తేవాలని ఆమెకు చెప్పాడు. ఆమె మరో గదిలో ఉన్న ఫ్రిజ్ వద్దకు వెళ్లి, మంచినీటి బాటిల్ తేవడానికి ప్రయత్నిస్తుండగా..చెప్పిన వెంటనే తేలేదని ఆమెను పట్టుకుని గోడకు కొట్టి ఆపై ఫ్రిజ్కు వేసి బాదడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో∙చికిత్స పొందుతూ నాగమణి శనివారం మృతి చెందింది. పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.


