సాక్షి, విశాఖపట్నం: భార్య రాధా గాయత్రి మృతిపై భర్త శ్రీచరణ్ స్పందించారు. నా భార్య రాధా గాయత్రి మరణానికి, నాకు ఎలాంటి సంబంధం లేదని.. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని శ్రీచరణ్ అన్నారు. ‘‘మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే, విబేధాలు ఉన్నట్టయితే ముస్సోరి ఎలా వెళ్తాం. హోటల్ ప్యాకేజ్లో భాగంగానే మద్యం సప్లయ్ చేశారు’’ అని శ్రీచరణ్ పేర్కొన్నారు.
‘‘ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు ఆడుతున్నారు. ఇప్పటికీ గాయత్రీ నా భార్య. గాయత్రీ తల్లిదండ్రులు నాకు కూడా తల్లిదండ్రులతో సమానం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. మూడు గ్రామాల సమస్య. నాకు బాధ్యత లేకపోతే సంప్రదాయాలు ఎందుకు పాటిస్తాను. నేను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాను’’ అంటూ శ్రీచరణ్ పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న గాయత్రి తల్లిదండ్రులు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ (సీపీ) కార్యాలయానికి చేరుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గాయత్రి మృతి సహజ మరణం కాదని, ఈ ఘటన వెనుక అనుమానాస్పద పరిస్థితులు ఉన్నాయని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమ అల్లుడి పాత్రపై అనుమానం ఉందని.. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


