
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/ మహారాణిపేట(విశాఖ): రాష్ట్రాన్ని వర్షాలు భయపెడుతూనే ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయానికల్లా అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆ తర్వాత వాయుగుండంగా మారడానికి అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇది ఒడిశా వైపు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్, యానాం, ఉత్తర కోస్తా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.