రేపు మూడు జిల్లాల్లో భారీ వర్షాలు!

Heavy rains in three districts of Andhra Pradesh - Sakshi

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి, ఆవర్తనం

సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. అదేవిధంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళా ఖాతంలో ఈ నెల 29న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది దిశ మార్చుకొని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా తెలంగాణ వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.

ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లా ల్లో తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో వెంకటగిరిలో 6.1 సెంటీమీటర్లు, తవనంపల్లెలో 5.1, గోరంట్లలో 4.9, కృత్తివెన్నులో 4.6,నూజివీడులో 4.5, తాడేపల్లిగూడెంలో 4.2, జగ్గయ్యపేటలో 3.7, పలమనేరులో 3.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top