సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమేపీ బలపడి, ఆ తర్వాత మూడునాలుగు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా శుక్రవారం ఎండ తీవ్రతతోపాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నంద్యాల జిల్లా కొలివిుగుండ్లలో 5, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 4.8, కృష్ణాపురంలో 4.6, పెదబొడ్డేపల్లెలో 4.1, విజయనగరం జిల్లా కొత్తవలసలో 3.9, కాకినాడ జిల్లా రౌతులపూడిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.


