కర్నూలు జిల్లా: సాంఘిక సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా డెప్యూటీ డైరెక్టర్గా పి.జ్యోతిలక్ష్మీ దేవిని నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శనివారం మరొక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జ్యోతిలక్ష్మీ దేవి స్థానంలో ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారిగా పనిచేస్తున్న కేఎల్ హర్షితను గుంటూరు జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జ్యోతిలక్ష్మీ దేవిని గుంటూరు నుంచి ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్గా నియమిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్క రోజు వ్యవధిలోనే బదిలీ ఉత్తర్వులు రావడం పై సాంఘిక సంక్షేమ శాఖలోని సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఏ అధికారి వచ్చినా కూడా కిందిస్థాయి సిబ్బంది చెప్పు చేతల్లోనే నడుస్తున్నారని విమర్శలు వస్తున్న తరుణంలో శనివారం సచివాలయానికి సెలవు దినం అయినప్పటికీ కూడా ఆకస్మిక బదిలీ జరగడం ఆ శాఖ సిబ్బందిలో విస్మయం కలిగిస్తోంది. కేఎల్ హర్షిత అయినా విధుల్లో చేరతారో లేదో అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.


