గెస్ట్‌ ఫ్యాకల్టీకి తీపి కబురు

Guest faculties thanking CM YS Jagan Andhra Pradesh - Sakshi

జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న వారికి 10 నెలలు రెన్యువల్‌

వేతనాలూ విడుదల చేసిన ప్రభుత్వం

1,074 మంది లెక్చరర్లకు లబ్ధి 

టీడీపీ హయాంలో 3 నుంచి 5 నెలలే రెన్యువల్‌ 

గంటల ప్రాతిపదికన పీరియడ్‌కు రూ.150 మాత్రమే 

ఎక్యుములేషన్‌ ఫండ్‌ లేక 87 కాలేజీల లెక్చరర్లకు మూడేళ్లుగా అందని వేతనాలు 

సీఎం జగన్‌ దృష్టికి వెళ్లడంతో సమస్యకు పరిష్కారం 

సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్న గెస్ట్‌ ఫ్యాకల్టీలు 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీకి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మొత్తం 1,074 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలకు 2022–23 సంవత్సరానికి 10 నెలలు రెన్యువల్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబరు 147 విడుదల చేసింది. వీరికి గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం 3 నుంచి 5 నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడ్‌కు రూ.150 చొప్పున ఇచ్చేవారు.

నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఇచ్చేవారు. అదీ.. కళాశాల ఎక్యుములేషన్‌ ఫండ్‌ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్‌ ఇచ్చేవారు. ఎక్యుములేషన్‌ ఫండ్‌ లేని కారణంతో  2017–18, 2018–19, 2019–2020 సంవత్సరాలకు మూడేళ్ల పాటు 87 కళాశాలల్లో లెక్చరర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి కష్టాలకు చెక్‌ పెడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెన్యువల్‌ కాలాన్ని పెంచడంతోపాటు ఎక్యుములేషన్‌ ఫండ్‌తో సంబంధం లేకుండా వేతనాలనూ విడుదల చేసింది. 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గెస్ట్‌ ఫ్యాకల్టీ 
ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని గెస్ట్‌ ఫ్యాకల్టీలు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాలను సానుకూలంగా విని సహకరించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

మాకు న్యాయం జరిగింది... 
ప్రభుత్వం గెస్ట్‌ ఫ్యాకల్టీల సమస్యలను గుర్తించి 10 నెలల రెన్యువల్‌ విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో మాకు న్యాయం జరిగింది. ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి మా గెస్ట్‌ ఫ్యాకల్టీ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 
– రాజేష్‌ పట్టా, గెస్ట్‌ ఫ్యాకల్టీ (ఫిజిక్స్‌), నందిగాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీకాకుళం జిల్లా 

సంతోషంగా ఉంది 
ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాకు ప్రభుత్వం రెన్యువల్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. విద్యా శాఖ మంత్రి దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. మా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రెన్యువల్‌ చేయించారు.
– పట్నాన శ్రీనివాసరావు, గెస్ట్‌ ఫ్యాకల్టీ,కామర్స్, ప్ర.జూ. కళాశాల, జి.సిగడాం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top