
తిరుమల/శ్రీకాళహస్తి/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తొలిసారిగా సంయుక్తంగా రూపొందించిన నాసా–ఇస్రో సింథటిక్ ఆపార్చర్ రాడార్ (నిసార్) అనే ఉపగ్రహాన్ని బుధవారం సాయంత్రం 5.40 గంటలకు ప్రయోగించనున్నారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ ఆధ్వర్యంలో కౌంట్డౌన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జియో సింక్రనస్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ ఎఫ్16) రాకెట్ ద్వారా 2,392 కేజీల బరువు కలిగిన నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలోమీటర్లు ఎత్తులోని సూర్య–సమకాలిక కక్ష్యలోకి నిసార్ను ప్రవేశపెట్టనున్నారు. భూగోళాన్ని పరిశోధించేందుకు ఎంతో దోహదపడే ఈ ఉపగ్రహం సుమారు 10 ఏళ్లు పాటు సేవలు అందిస్తుంది.
భవిష్యత్తులో ఇస్రో–నాసా కలిసి మరిన్ని ప్రయోగాలు..
ఇస్రో, నాసా బంధం బలపడి రాబోయే కాలంలో మరో మూడు ప్రయోగాలను సంయుక్తంగా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.నారాయణన్ పేర్కొన్నారు. అలాగే, చంద్రయాన్–4 ప్రయోగ పనులకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి గగన్యాన్–1 పేరుతో ప్రయోగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పీఎస్ఎల్వీ సిరీస్లో కూడా మరో నాలుగు ప్రయోగాలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
మంగళవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాకెట్ నమూనాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని, సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ ఎప్16 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు.