త్వరలో అందుబాటులోకి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ | Genome Sequencing Lab to find out corona virus available soon in AP | Sakshi
Sakshi News home page

త్వరలో అందుబాటులోకి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌

Dec 10 2021 4:04 AM | Updated on Dec 10 2021 4:04 AM

Genome Sequencing Lab to find out corona virus available soon in AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తించే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ వచ్చే వారంలో రాష్ట్రంలోనే అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటు కోసం సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 15% నమూనాలను వైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నారు.

ఇప్పుడు ఒమిక్రాన్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణయితే.. వారి నమూనాలను కూడా హైదరాబాద్‌కే పంపాల్సి వస్తోంది. దీని వల్ల ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. విజయవాడలో ల్యాబ్‌ అందుబాటులోకి వస్తే ఫలితాలు త్వరగా వెల్లడవుతాయని అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారంలో ల్యాబ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ల్యాబ్‌లో పనిచేయనున్న వైద్యులు, సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించినట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement