సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు అధికారిపైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కాగా, కేసు విచారణ నిమిత్తం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవ ప్రసాద్ బృందం శుక్రవారం ఉదయం సాయికృష్ణ నివాసానికి చేరుకుంది.
ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐల బృందం.. సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. అయితే, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో వారి నివాసంలోనే పోలీసుల బృందం కాసేపు వేచి ఉన్నారు. ఈ క్రమంలో విచారణ అధికారి ఏసీపీ దైవ ప్రసాద్తో సాయికృష్ణ మేనమామ మాట్లాడుతూ.. సీఐ చంపింది.. ఒకరిని కాదు.. ఇద్దరినీ అంటూ మండిపడినట్టు సమాచారం. సాయికృష్ణని భౌతికంగా చంపితే.. అతడి తల్లిని మానసికంగా చంపారు అంటూ ఘాటుగా స్పందించినట్టు తెలిపింది. మరోవైపు.. కాసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు ఫోరెన్సిక్ టీమ్ చేరుకుంది. సాయికృష్ణ కేసులో ఆధారాల సేకరణపై ఫోరెన్సిక్ టీమ్ దృష్టిపెట్టింది.
ఇదిలా ఉండగా.. సాయికృష్ణ ఇంటికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరామర్శకు వెళ్లిన తర్వాతే ఈ కేసులో.. ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాల్లో కదలికలు రావడం గమనార్హం. ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి 11గంటల సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వెళ్లింది. ఆ తర్వాతే సీఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇవ్వగా.. అప్పటికప్పుడే నాగరాజుపై కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉంటే.. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు. సీఐ నాగరాజుపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడం గమనార్హం. క్రైమ్ నంబర్ 107/2026గా నమోదైన ఈ కేసులో .. బీఎన్ఎస్ సెక్షన్ 127(4), 127(6), 103(1)తో పాటు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 238 కింద అభియోగాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది.


