మా శవాలపై వెళ్లి భూములు తీసుకోండి | Farmers make it clear that they will not give their lands to solar companies | Sakshi
Sakshi News home page

మా శవాలపై వెళ్లి భూములు తీసుకోండి

Jun 30 2025 3:35 AM | Updated on Jun 30 2025 3:35 AM

Farmers make it clear that they will not give their lands to solar companies

సోలార్‌ కంపెనీకి భూములు ఇవ్వబోమని స్పష్టం చేసిన కరేడు రైతులు 

పోలీసుల నిర్బంధాలను దాటుకుని జాతీయ రహదారిపై రాస్తారోకో 

ఉలవపాడు/సాక్షి, అమరావతి: ‘తరతరాలుగా ఈ భూములే మాకు జీవనాధారం. సోలార్‌ కంపెనీకి మా భూములు ఇచ్చేది లేదు. మేం బతికుండగా సెంటు భూమి కూడా ఇవ్వం. ప్రభు­త్వం వెనక్కి తగ్గకపోతే మా శవాల మీదుగా వెళ్లి భూములు తీసుకోవాల్సి ఉంటుంది’ అని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు రైతులు తేల్చి చెప్పారు. కరేడు గ్రామానికి చెందిన 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్‌ సోలార్‌ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌కు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇచ్చింది. 

భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు భూసేకరణకు మొగ్గుచూపడంతో ఆదివారం కరేడు ర్యాంపు వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించా­ల­ని రైతులు పిలుపునిచ్చారు. పోలీసులు ఈ కార్యక్ర­మాన్ని భగ్నం చేసేందుకు ఆంక్షలు విధించా­రు. ముందస్తుగా గ్రామానికి చెందిన రైతు నేత మిరి­యం శ్రీనివాసులుని అరెస్టు చేశారు.  

భారీ బందోబస్తు... అడుగడుగునా ఆంక్షలు 
ఆదివారం ఉదయం కరేడు ర్యాంపు వద్ద 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి ఎవరూ బయటకు రా­కుండా ప్రతి వీధిలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. భూ­ములు కోల్పోతున్న రైతులు, వారికి అండగా గ్రామస్తులు బైకులు, ట్రాక్టర్లలో దాదాపు రెండు వేల మంది ర్యాంప్‌ వద్దకు రావడంతో పోలీసులు బారికేడ్లు, రోప్‌లతో అడ్డుకున్నారు. ముందుగా వచ్చిన రైతులను అదుపులోకి తీసుకున్నారు. సబ్‌కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు.

‘మా భూములు పోతే ఎవరు తిరిగిస్తారు. ఎవరో పెద్ద వ్యక్తులకు మా భూములు మీరు ఎలా ఇస్తారు?’ అని సబ్‌ కలెక్టర్‌ను ప్రశ్నించారు. గంటపాటు పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. రైతులు జాతీ­య రహదారిపైకి వెళ్లకుండా పోలీసు వాహనా­లు, లారీలు అడ్డుపెట్టారు. అయినా వారు పొలా­ల్లో నుంచి జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కరేడు నుంచి మహిళా రైతులు భారీగా తరలివచ్చి రహదారిపై బైఠాయించారు. ఐదు కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో మళ్లీ సబ్‌ కలెక్టర్‌ శ్రీపూజ వచ్చి రైతులతో చర్చలు జరిపారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు. కాగా, నిరసన తెలి­పిన ప్రజల నిర్బంధం, వారికి మద్దతుగా వెళ్లిన నాయకుల అక్రమ అరెస్టులను సీపీఐ, సీపీఎం తీవ్రంగా ఖండించాయి. రాస్తా­రోకో చేసిన 38మంది రైతులు, నేతలపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై అంకమ్మ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement