
ఏజెన్సీల్లో అక్కరకు రాని బర్త్ వెయిటింగ్ హోమ్స్
కేంద్రాలకు గర్భిణులను తరలించడంలో వైఫల్యం
వైద్య సేవలను గాలికి వదిలేసిన ప్రభుత్వం
విజయనగరం జిల్లా కొండ శిఖర గ్రామం రేగపుణ్యగిరికి చెందిన నిండు గర్భిణికి మే ఒకటో తేదీన పురిటి నొప్పులు వచ్చాయి. వాహనంలో ఆస్పత్రికి తరలించే వీలు లేక డోలీలో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరే లోపే నొప్పులు తీవ్రమై మార్గమధ్యంలోనే గర్భిణి ప్రసవించింది.
పాడేరు మండలం వరంకుర గ్రామానికి చెందిన గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తరలించే సమయం లేకుండా పోయింది. దీంతో ఇంట్లోనే ప్రసవించాల్సిన పరిస్థితి తలెత్తింది. బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవానంతరం తల్లి కోలుకోలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం గ్రామస్తులు కిలోమీటర్ల కొద్ది డోలీలో మోసుకుని వెళ్లి ఆస్పత్రికి తరలించారు.
గతేడాది నవంబర్లో సీతంపేట ఏజెన్సీ అంటికొండ పెద్దగూడలో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు డోలీలో ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో గ్రామంలోని మహిళలే ఇంట్లో ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డలను సీతంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. – సాక్షి, అమరావతి
ఇవీ గిరిజన ప్రాంతాల్లో కాబోయే తల్లుల ప్రసవ వేదనలకు అద్దం పట్టే ఉదంతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి నిత్యం ఏజెన్సీ ప్రాంతాల్లో చోటుచేసుకోవడం పరిపాటైపోయింది. పురిటి నొప్పుల సమయంలో డోలీలో తరలించడం, అదృష్టం బాగుంటే దారిలోనే కాన్పు సుఖాంతం కావడం జరిగిపోతుంటాయి. కానీ ప్రశాంతంగా ఆసుపత్రిలో బిడ్డను కనే అదృష్టానికి సగటు గిరిమహిళ నోచుకోలేకపోతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాతాశిశు సంరక్షణ పటిష్టంగా అమలవడం లేదనడానికి పై ఘటనలే నిదర్శనం.
అక్కరకు రాని బర్త్ వెయిటింగ్ హోమ్స్
ఏజెన్సీ ప్రాంతాల ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ హోమ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచి్చంది. అయితే ఈ నివాసాలు అలంకార ప్రాయంగా మారాయి. గర్భిణులను ప్రసవానికి ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్కు తరలించి సురక్షిత ప్రసవాలు చేపట్టడం ఈ హోమ్స్ ప్రధాన లక్ష్యం. కానీ ఆ దిశగా వాటిని అక్కరకు తీసుకువచ్చేలా ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. దీంతో ఏజెన్సీలోని కాబోయే తల్లులు, నవజాత శిశువుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయి.
ఏదీ ఆ చొరవ?
రాష్ట్రంలో 8 ఐటీడీఏలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా 50 వేల మంది మహిళలు గర్భం దాలుస్తుంటారు. గిరిశిఖర గ్రామాల్లోని గర్భిణులు పురిటి నొప్పులు మొదలయిన వెంటనే ఆస్పత్రులకు వెళ్లడం ఎంతో కష్టం. కనీసం రవాణా సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో ఇక్కడి గర్భిణులను ప్రసవ తేదీకి 7–10 రోజుల ముందే బర్త్ వెయిటింగ్ హోమ్కు తరలించాలి. ఇందు కోసం గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో గిరిజన, వైద్య శాఖల ఆ«ధ్వర్యంలో 76 బర్త్ వెయిటింగ్ హోమ్స్ ఉన్నాయి.
పీహెచ్సీ ల పరిధిలో వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది దగ్గరుండి ఆస్పత్రులకు చేర్చాలి. కానీ అలాంటి చొరవ క్షేత్రస్థాయిలో కానరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో విధిలేక గర్భిణీని డోలీలపై మోస్తూ ఆస్పత్రులకు చేర్పించాల్సిన పరిస్థితి తప్పడం లేదు.
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నిర్లక్ష్యం
పీహెచ్సీల వారీ గర్భిణుల వివరాలు నమోదై ఉంటాయి. ప్రసవ నిర్ధారణ తేదీ (ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్)ని ముందుగానే నిర్ణయిస్తారు. కాబట్టి గర్భిణులను డెలివరీ తేదీకి ముందే బర్త్ వెయిటింగ్ హోమ్స్కు తరలించడం సులువైన అంశం. కానీ అలాంటి చొరవ క్షేత్రస్థాయిలో కానరావడం లేదు. దీంతో డోలీల్లో ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి అవస్థలు ఈ యుగంలో తప్పేలా లేవంటూ గిరి మహిళలు నిట్టూరుస్తున్నారు.