మూడునెలల చిన్నారితో సహా ప్రియుడితో వచ్చిన మహిళ
గ్రామస్తులు చేరదీయకపోవడంతో బలవన్మరణం
మహిళ, పసికందు మృతి.. ప్రియుడి పరిస్థితి విషమం
హాలహర్వి: వివాహేతర బంధం విషాదాంతమైంది. ఓ మహిళ, ఆమె మూడునెలల పసికందును బలితీసుకుంది. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని గూళ్యం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. గూళ్యం గ్రామానికి చెందిన మహేష్(39) కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సంగనకల్లు గ్రామానికి చెందిన దివ్యాంగురాలిని రెండో పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. అదే గ్రామంలో వివాహిత లీలావతి(36)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో లీలావతిని ఆమె భర్త పలుమార్లు దండించాడు. ఈ విషయాన్ని లీలావతి తన ప్రియుడు మహేష్ తో చెప్పింది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని లీలావతి, మహేష్, మూడు నెలల చిన్నారితో నాలుగు రోజుల క్రితం గూళ్యం గ్రామానికి చేరుకున్నారు. వీరిని గ్రామంలో ఎవరూ చేరదీయకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామశివారులోని వంకలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఘటనలో లీలావతి, మూడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. మహేష్ కొన ఊపిరితో ఉన్నాడు. పొలం పనులకు వెళ్లిన రైతులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. హాలహర్వి ఎస్ఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలను స్థానికుల నుంచి తెలుసుకున్నారు. లీలావతి, మూడు నెలల చిన్నారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి బళ్లారికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈశ్వరరావు తెలిపారు.


