దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు..! | Encroachment of temple lands: Andhra pradesh | Sakshi
Sakshi News home page

దేవుడి భూములు రక్షించే దిక్కు లేదు..!

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

Encroachment of temple lands: Andhra pradesh

ఏడాదిన్నరగా ఖాళీగా దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ పోస్టు  

ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో నాలుగు వేల వివాదాలు  

ముందు ట్రిబ్యునల్‌ గడప తొక్కకుండా హైకోర్టులోనూ కేసు ఫైలు చేయలేని పరిస్థితి 

ట్రిబ్యునల్‌లో పనిచేస్తున్న సిబ్బంది 12 మందే 

వారిలోనూ ఏడుగురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే 

ఆక్రమణలో 87 వేల ఎకరాలకుపైగా దేవుడి భూములు  

ఆక్రమణలకు అడ్డుకట్ట, వివాదాల పరిష్కారంపై దృష్టి సారించని చంద్రబాబు ప్రభుత్వం  

సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణల కట్టడిని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. దేవాలయాల భూముల ఆక్రమణలు, ఇతర వివాదాలు పరిష్కరించే దేవదాయశాఖ ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా చైర్మన్‌ను కూడా నియమించలేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన ట్రిబ్యునల్‌ చైర్మన్‌ పదవీ కాలం ముగియక ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 2024 అక్టోబరులో ఆ పదవికి రాజీనామా చేశారు. రిటైర్డు జిల్లా జడ్జి స్థాయికి తక్కువ కాని వ్యక్తులే దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. అయినప్పటికీ, అప్పట్లో ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగానే ఆయన పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. 

రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు ఉండగా... ప్రభుత్వ గణాంకాల ప్రకారమే అందులోని 87 వేలకు పైగా ఎకరాల భూమి ఆక్రమణదారుల చెరలో ఉంది. దేవదాయ శాఖ భూ వివాదాలకు సంబంధించి అధికారులు ఆక్రమణల తొలగింపునకు చిన్న చర్య తీసుకోవాలన్నా ట్రిబ్యునల్‌ ఆదేశాలతోనే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఏ భూ వివాదానికి సంబంధించైనా ముందు ట్రిబ్యునల్‌ గడప తొక్కకుండా నేరుగా హైకోర్టులో కేసులు ఫైల్‌ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవైపు వేల ఎకరాల దేవుడి భూములను ఆక్రమణదారులు కబ్జా చేస్తుండగా.. ప్రభుత్వం ఆక్రమణల కట్టడికి ఆదేశాలు జారీ చేసే ట్రిబ్యునల్‌ చైర్మన్‌ స్థానం భర్తీ చేయకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంపై దేవదాయ శాఖ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వమే ఆక్రమణదారులకు కొమ్ముకాస్తోందన్న ఆరోపణలున్నాయి.  

నాలుగు వేల కేసులు పెండింగ్‌లోనే.. 
దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సుమారు 4 వేల కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రిబ్యునల్‌లో దేవుడి భూముల వివాదాలతోపాటు ఆలయాలకు సంబంధించి వంశపారంపర్య ధర్మకర్తల వివాదాలకు సంబంధించిన కేసులు నమోదవ్వగా.. అందులో 95 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  

ట్రిబ్యునల్‌లో సిబ్బందీ కొరతే.. 
దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది సంఖ్య చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి ఏపీలోని దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌ను విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా విడదీశారు. తెలంగాణ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేవలం 1000 కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ఆ రాష్ట్ర ట్రిబ్యునల్‌లో మొత్తం 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో నాలుగు రెట్లు ఎక్కువగా నాలుగు వేలకు పైగా పెండింగ్‌ కేసులు ఉన్నప్పటికీ కేవలం 12 మంది సిబ్బందే పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

వారిలోనూ ఏడుగురు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే కావడం గమనార్హం. రాష్ట్ర పరిస్థితులు నేపథ్యంలో వివిధ ప్రాంత కక్షిదారుల సౌకర్యం కోసం ప్రతీ నెలలో కనీసం ఒక్క రోజు చొప్పునైనా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో ప్రాంతీయ కోర్టులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌లో 14 మంది అదనపు సిబ్బందిని అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో నియామకానికి అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.  


రాష్ట్రంలో దేవుడి భూముల పరిస్థితి ఇదీ  
మఠాలు : 135 
దేవదాయ శాఖ పరిధిలో గుళ్ల సంఖ్య : 26,970 
ఆయా ఆలయాలు, గుళ్లు పేరిట ఉన్న దేవదాయ శాఖ భూములు : 4,67,283.28 ఎకరాలు 
దేవదాయశాఖ అధికారులు లీజుకిచ్చిన భూములు : 1,60,767 ఎకరాలు 
వివిధ సర్వీసుదారుల ఆదీనంలో ఉన్న భూములు : 1,21,596.04 ఎకరాలు 
వ్యవసాయానికి పనికి రాని కొండలు, బంజరు భూములు : 85,200 ఎకరాలు 
గుళ్లు, ఆ చుట్ట పక్కల భూములు : 4355.29 ఎకరాలు 
ఆక్రమణలలో ఉన్న భూములు : 87,167 ఎకరాలు 
వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు భూ సేకరణ జరిగి, అందుకు నిధులు విడుదల కాని భూములు : 8,196.63 ఎకరాలు 

Advertisement
 
Advertisement
Advertisement